Pak vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. న్యూజిలాండ్ ఓపెనర్లు తమ జట్టుకు స్థిరమైన ఆరంభాన్ని అందించారు. అయితే మ్యాచ్ ప్రారంభంలోనే పాక్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే పాక్ జట్టుకు చెందిన కీలక ఆటగాడు గాయపడ్డాడు.
మొదటి ఓవర్ ను పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది వేశాడు. షాహీన్ అప్రిది వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి కివీస్ ఓపెనర్ విల్ యంగ్ మిడ్-ఆఫ్ ఆఫ్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఓ గ్యాప్ దొరికడంతో బంతి మెల్లగానే బౌండరీ వైపుకు వెళ్తోంది. బంతి బౌండరీని చేరుకోవడానికి సమయం పడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఆ సమయంలో పాకిస్థాన్ కీలక ఆటగాడు ఫఖర్ జమాని బంతిని ఆపడానికి చాలా దూరం పరిగెత్తాడు. చివరకు కింద పడి జారుతూ బంతిని ఆపాడు. కానీ ఫఖర్ జమాన్ బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ క్రికెట్ జట్టులో సామ్ అయూబ్ స్థానంలో ఫఖర్ జమాన్ ను చేర్చారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ సందర్భంగా సామ్ అయూబ్ గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫఖర్ జమాన్ పాకిస్థాన్ తరఫున జట్టుకు ప్రధాన ఓపెనింగ్ బ్యాటర్ గా మైదానంలోకి దిగుతాడు. కానీ ఫీల్డింగ్ సమయంలో ఫఖర్ జమాన్ కు గాయం కావడం కెప్టెన్ రిజ్వాన్ కు ఆందోళన కలిగించే విషయంగా మారింది. ప్రస్తుతం ఫఖర్ జమాన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఫఖర్ జమాన్ కు గాయం కావడంతో ఆ దేశ క్రికెట్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.