ఐపీఎల్-2024లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. టాప్-2లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తదుపరి దశకు చేరుకోవడం దాదాపు ఖాయమైంది. మిగిలిన రెండు స్థానాల కోసం ముంబై ఇండియన్స్ మినహా మిగిలిన జట్లన్ని పోటీలో ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొననుంది.
అయితే ఈ కీలక సమయంలో సీఎస్కేకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరనా సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. తొడకండరాల గాయం కారణంగా తిరిగి తన స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ శ్రీలంక స్టార్ బౌలర్ ఐపీఎల్ 2024లో ఆరు మ్యాచ్లే ఆడాడు. కానీ 13 వికెట్లతో సత్తాచాటాడు. ఏ దశలో అయినా ప్రత్యర్థికి కళ్లెం వేసి మ్యాచ్ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న పతిరనా దూరమవ్వడం చెన్నైకి కోలుకోలేని ఎదురుదెబ్బే.

''చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీషా పతిరణా తొడకండరాల గాయంతో బాధ పడుతున్నాడు. చికిత్స కోసం అతడు తిరిగి శ్రీలంకకు వెళ్తున్నాడు'' అని సీఎస్కే ప్రకటన విడుదల చేసింది. అయితే పతిరనా వీసా ప్రక్రియ కోసం ఇటీవలే స్వదేశానికి వెళ్లి తిరిగి జట్టుతో చేరాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పాల్గొనడానికి వచ్చాడు. కానీ గాయంతో అతను దూరమయ్యాడు.
సీఎస్కే ఇప్పటికే విదేశీ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ను కోల్పోయిన విషయం తెలిసిందే. జింబాబ్వేతో బంగ్లాదేశ్ టీ20 సిరీస్ ఆడుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ సీఎస్కే జట్టుకు దూరమయ్యాడు. అతను తిరిగి ఈ సీజన్లో జట్టుతో చేరడం దాదాపు అసాధ్యమే. అంతేగాక దీపక్ చాహర్ కూడా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సొంతమైదానంలో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే చాహర్ నొప్పితో మైదానాన్ని వీడాడు. అనంతరం అతని గాయం తీవ్రమైనదిగా తెలిసింది. పాకిస్థాన్తో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీ కూడా జట్టును త్వరలో వీడనున్నాడు. దీంతో ప్లేఆఫ్స్ ముంగిట సీఎస్కేకు వరుసగా ఊహించని షాక్లు ఎదురవుతున్నాయి.