హైదరాబాద్: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ తన చిన్ననాటి స్నేహితురాలు నుపుర్ నగార్ను గురువారం వివాహం చేసుకున్నాడు. మీరట్లోని ఓ రిసార్ట్లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి అనంతరం నవంబర్ 26న బులంద్షెహర్లో, 30న ఢిల్లీలో రెండు రిసెప్షన్లను ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో జరిగే విందు కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు సభ్యులు హాజరయ్యే అవకాశముంది. భారత సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్లో పాలుపంచుకోవాలని కోరుకున్నామని భువీ తండ్రి కిరణ్పాల్ సింగ్ తెలిపారు. అయితే పెళ్లి సమయానిక వీలు కాకపోవడంతో వారి కోసం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన మూడో టెస్టు డిసెంబర్ 2 నుంచి ఫిరోజ్ షా కోట్లాలో జరగనుంది. దీంతో టీమిండియా కోసం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. కాగా, అక్టోబర్ 4వ తేదీన ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నోయిడాలో భువీ-నగార్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
భువీ, నుపుర్ చిన్నప్పటి నుంచే స్నేహితులు. వీళ్ల కుటుంబాలు మీరట్లోని గంగానగర్లో ఇరుగు పొరుగున నివాసం ఉండేవి. దీంతో ఎప్పటి నుంచో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. దీనికి తోడు భువీ తండ్రి కిరణ్పాల్ సింగ్, నుపుర్ తండ్రి యశ్పాల్ సింగ్.. ఇద్దరూ ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు.