పల్లెకెల్: బౌలింగ్లో విఫలమైనా.. బ్యాట్తో సత్తా చాటి సరైన సమయంలో జట్టును ఆదుకున్నాడు టీమిండియా పేసర్ భువనేశ్వర్. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అతను సమయోచితంగా ఆడిన తీరు విమర్శకుల చేత ప్రశంసలు పొందేలా చేసింది.
ఒక దశలో 131పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్.. ఇక చాప చుట్టేస్తుందేమోనన్న అనుమానం కలిగింది. క్రీజులో ఒక ఎండ్ లో ధోని ఉన్నప్పటికీ.. భువీ ఇంత బాగా ఆడుతాడని ఎవరూ ఊహించలేదు. అలాంటి తరుణంలో.. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ధోనితో కలిసి ఎనిమిదో వికెట్ కు 100పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు భువీ.

భారత్ తరుపున ఎనిమిదో వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో మరో విశేషం కూడా ఉంది. 10ఓవర్లు బౌలింగ్ చేసిన భువీ 53పరుగులు ఇచ్చాడు. తిరిగి బ్యాటింగ్ లోను భువీ అన్ని పరుగులే చేయడం విశేషం. మొత్తం మీద వన్డేల్లో తన తొలి అర్ధ సెంచరీని భువీ ఎప్పటికీ గుర్తుంచుకునే రీతిలో మలుచుకున్నాడనే చెప్పాలి.
80బంతుల్లో 4ఫోర్లతో, ఒక సిక్సర్ తో 53పరుగులు సాధించి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు ధోని సైతం చాలారోజుల తర్వాత మరోసారి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 68బంతుల్లో 45పరుగులతో ఒత్తిడిలోను తాను 'కూల్'గా ఆడుతానని మరోసారి నిరూపించుకున్నాడు.