బెంగళూరు: తమ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరించిన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్పై సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపిఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్న భువనేశ్వర్.. ప్రపంచ స్థాయి బౌలర్ అని కొనియాడాడు. ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను హడలెత్తిస్తాడని చెప్పాడు.
'అతడు(భువనేశ్వర్ కుమార్) భారత జట్టులో ఉన్నా లేకున్నా.. అతనొక ప్రపంచ స్థాయి బౌలర్. తొలి బంతి నుంచే భువనేశ్వర్.. బ్యాట్స్మెన్లపై దాడి చేస్తాడు' అని వార్నర్ పేర్కొన్నాడు. భువనేశ్వర్ శక్తి సామర్థ్యాలపై తాను నమ్మకం ఉంచానని, ఆ నమ్మకాన్ని అతడు నిలబెట్టుకున్నాడని తెలిపాడు.
భువనేశ్వర్ ఆటను ఎంతో ప్రేమిస్తాడని, తమ జట్టు తక్కువ స్కోరు చేసినప్పుడు, ప్రత్యర్థి జట్టు భారీగా పరుగులు చేయకుండా అరికట్టేందుకు భువిపై ఆధారపడ్డామని చెప్పాడు.

బంగ్లాదేశ్కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్ కూడా అద్భుతంగా రాణించాడని వార్నర్ తెలిపాడు. భువనేశ్వర్ తోపాటు అతడు జట్టుకు కీలకంగా మారాడని తెలిపాడు. అతను మరింతగా రాణించాలని కోరుకుంటున్నట్లు వార్నర్ చెప్పాడు.
'క్రిస్ గేల్ మైదానంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో అతడ్ని కట్టడి చేయాలని భావించాం. కానీ, కుదర్లేదు. దీంతో అతడ్ని ఔట్ చేసేందుకు ప్రయత్నించాం. వైడ్, స్లో బంతులు వేయాలని చెప్పా. వికెట్లు పడితే మేము తప్పక గెలుస్తామని భావించా' అని వార్నర్ తెలిపాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 208 పరుగులు చేయగా, బెంగళూరు 200 పరుగులు చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. 38బంతుల్లో 69 పరుగులు చేసిన వార్నర్ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా బౌలర్లు రాణించడంతో హైదరాబాద్ విజయం సులభమైంది.