
హైదరాబాద్: జోహెన్స్బర్గ్ వేదికగా భారత్తో ఆదివారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఓటమికి భారత పేసర్ భువనేశ్వర్ కుమారే కారణమని ఆ జట్టు ఆటగాడు హెండ్రిక్స్ అన్నాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్లో 204 పరుగుల లక్ష్యంతో ఛేదనకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. భువనేశ్వర్ (5/24) దెబ్బకు 175/9కే పరిమితమైంది.
మ్యాచ్ ఆరంభంలోనే వరుస ఓవర్లలో వికెట్లు తీసిన భువీ, ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అద్భుతం చేశాడు. ఒక ఎండ్లో సహచరులు వరుసగా పెవిలియన్కు చేరుతున్నా... ఓపెనర్ హెండ్రిక్స్ (70) ఒంటరిగానే పోరాటం చేశాడు. అయితే చివర్లో అతడిని కూడా భువీ పెవిలియన్కు చేర్చడంతో భారత జట్టు విజయం ఖాయమైంది.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం హెండ్రిక్స్ మాట్లాడుతూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్కి స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ ఇవ్వలేదని వివరించాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులు విసురుతూ తమను క్రీజులో కుదురుకోనివ్వకుండా చేశాడని అన్నాడు.
'మ్యాచ్ మొత్తం భువనేశ్వర్ కుమార్ నిలకడగా బౌలింగ్ చేశాడు. చక్కటి లైన్ అండ్ లెంగ్త్ బంతులు విసురుతూ.. సఫారీ బ్యాట్స్మెన్ను స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. దీంతో అతడి బౌలింగ్లో సింగిల్స్ తీసుకోవడం తప్ప బౌండరీలకు ఆడే అవకాశమే లేకుండా పోయింది. ఓపెనర్గా నేను జట్టుకి మెరుగైన ఆరంభమిచ్చి.. దానిని కొనసాగించాలనే ఆడాను' అని తెలిపాడు.
అయితే మధ్యలో కొన్ని కీలక వికెట్లని చేజార్చుకోవడం దక్షిణాఫ్రికా జట్టుని దెబ్బతీసిందని అన్నాడు. భువీ ప్రణాళిక ప్రకారం బంతులు వేశాడని, అద్భుతంగా బౌలింగ్ వేశాడని కొనియాడాడు. తొలి పవర్ ప్లేలో టీమిండియా తమకంటే బాగా ఆడిందని హెండ్రిక్స్ కొనియాడాడు. బ్యాటింగ్కు పిచ్ అనుకూలించినా బౌలర్లు రాణించడంతో తమకు పరుగులు తీయడం కష్టంగా మారిందని చెప్పాడు.
మూడు టీ20ల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 బుధవారం (ఫిబ్రవరి 21) నాడు సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్స్ పార్కులో జరగనుంది. తొలి టీ20లో విజయం సాధించడంతో కోహ్లీసేన 1-0 ఆధిక్యంలో నిలిచింది.