
లక్నో: టీమిండియా బౌలింగ్ వెన్నెముక భువనేశ్వర్ కుమార్.. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారి లక్షణాలు కనిపించడంతో అతను ఐసొలేషన్లోకి వెళ్లాడు. భువనేశ్వర్ కుమార్తో పాటు అతని భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్లోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దీనితో వారంతా ఇంట్లోనే ఐసొలేషన్లో ఉంటోన్నారు. ఇటీవలే భువి తండ్రి కన్నుమూశారు. ఈ ఘటన చోటు చేసుకున్న రెండువారాల్లోపే కుటుంబం మొత్తం వైరస్ బారిన పడటం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
భువనేశ్వర్ కుమార్.. తన కుటుంబంతో కలిసి ఉత్తర ప్రదేశ్ మీరట్లోని గంగానగర్లో నివాసం ఉంటోన్నారు. అతని తండ్రి కిరణ్ పాల్ సింగ్ కిందటి నెల 20వ తేదీన మరణించారు. కాలేయ వ్యాధితో బాధపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ ఘటన చోటు చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే భువనేశ్వర్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అనారోగ్యానికి గురైన అతనికి వైద్య పరీక్షలను నిర్వహించగా పాజిటివ్గా తేలింది.
అనంతరం భార్య నుపుర్ నగర్, తల్లి ఇంద్రేష్లకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. భువనేశ్వర్ కుమార్, అతని భార్య ఇంట్లోనే ఐసొలేషన్లోకి వెళ్లగా.. తల్లిని మీరట్లోని దయావతి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ మధ్యకాలంలో భువి ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోన్నాడు. ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్ 2021 ఫేస్ 1లోనూ అంచనాలకు అనుగుణంగా అతని ఆటతీరు కనిపించలేదు.
ఫలితంగా- భారత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ సహా, ఇంగ్లాండ్లో పర్యటించాల్సిన భారత జట్టులో అతనికి చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ సహా ఇంగ్లాండ్ పర్యటనకు అతణ్ని ఎంపిక చేయకపోవడం పట్ల మొదట్లో దుమారం చెలరేగింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలెక్షన్ కమిటీపై అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. భువనేశ్వర్ను తీసుకోకపోవడం బౌలింగ్ విభాగం బలహీనపడినట్టవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.