భువి లేదా షమీ? ఇద్దరిలో ఒకరికే అవకాశం
పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ భువనేశ్వర్ కుమార్ కోలుకోవడం హర్షించదగ్గ పరిణామమే. అయినప్పటికీ..జట్టు మేనేజ్మెంట్ను ఇది ఇబ్బందుల్లోకి నెట్టినట్టయింది. దీనికి కారణం- ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మరో పేస్ బౌలర్ మహమ్మద్ షమీ రాణించడమే. మ్యాచ్ చేజారిపోతుందనుకుంటున్న దశలో షమీ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో హ్యాట్రిక్ తీసుకున్నాడు. మూడు వరుస బంతుల్లో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. 36 సంవత్సరాల తరువాత ప్రపంచకప్ టోర్నమెంట్ హ్యాట్రిక్ తీసుకున్న రెండో భారతీయయ బౌలర్గా నిలిచిపోయాడు. ఈ పరిస్థితుల్లో అతణ్ని తొలగించి భువనేశ్వర్ కుమార్కు చోటు కల్పించాలా? వద్దా? అనే విషయంపై తర్జన భర్జలను పడుతోంది మేనేజ్మెంట్.
నా ఛాయిస్.. భువనేశ్వరే
ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో మహమ్మద్ షమీ హ్యాట్రిక్ తీసుకున్నప్పటికీ.. తాను మాత్రం భువనేశ్వర్ కుమార్ వైపే మొగ్గు చూపుతానని లెజెండరీ బ్యాట్స్మెన్ సచిన్ టెండుల్కర్ చెప్పారు. భువనేశ్వర్ కుమార్ వందశాతం ఫిట్గా ఉంటే అతణ్ణే తుది జట్టులోకి తీసుకోవాలని తాను సూచిస్తానని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం- స్వింగ్. షమీతో పోల్చుకుంటే లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి బంతులు వేయడంతో పాటు పిచ్ నుంచి స్వింగ్ను రాబట్టగల సత్తా భువనేశ్వర్ కుమార్కే ఉందని సచిన్ అన్నారు. స్వింగ్ బంతులను ఆడటంలో వెస్టిండీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారని చెప్పారు. వెస్టిండీస్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడానికి షమీ కంటే భువనేశ్వర్ కుమార్నే ఆడించాలని ఆయన అన్నారు.
విండీస్తో టీమిండియా ఢీ..
ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా- బాగా అచ్చి వచ్చిన మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు గురువారం వెస్టిండీస్ టీమ్ను ఎదుర్కొనబోతోంది. సెమీ ఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకోవాలంటే కోహ్లీ సేనకు ఈ మ్యాచ్తో పాటు మరొకటి గెలవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ను కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. ఈ నెల 16వ తేదీన పాకిస్తాన్ జట్టును ఓడించిన ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలోనే వెస్టిండీస్ను ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఇదే స్టేడియం, ఇదే పిచ్పై పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ వేస్తున్న సమయంలో కాలి కండరాలు పట్టేయడంతో భువనేశ్వర్ కుమార్ అర్ధంతరంగా వైదొలగిన విషయం తెలిసిందే.