
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ఐదు మ్యాచ్ల ట్వంటీ 20 ఇంటర్నేషనల్ సిరీస్లో మొదటి రెండు మ్యాచ్లలో భారత్ ఓడి 0-2తేడాతో వెనకబడ్డ సంగతి తెలిసిందే. కటక్లో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఓడిపోయినప్పటికీ ఆ మ్యాచ్లో సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆకట్టుకున్నాడు. గాయాలు, ఫామ్ కోల్పోవడం వల్ల అతని కెరీర్ పట్టాలు తప్పుతున్న క్రమంలో రెండో టీ20లో అద్భుతంగా బౌలింగ్ చేసి మళ్లీ తన మునుపటి ఫామ్ అందుకున్నాడు.
భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో కేవలం 13పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి భారత్ రెండో టీ20లో పోరాడడానికి చేయాల్సినంత చేశాడు. కానీ మిగతా బౌలర్ల నుంచి సపోర్ట్ అంతగా లేకపోవడంతో ఆ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలయింది.
ఇక భువనేశ్వర్ రెండో టీ20లో తీసిన నాలుగు వికెట్లలో మూడు వికెట్లు పవర్ప్లేలో వచ్చాయి. తద్వారా టీ20 క్రికెట్లో పవర్ప్లే ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వెస్టిండీస్కు చెందిన శామ్యూల్ బద్రీ, న్యూజిలాండ్కు చెందిన టిమ్ సౌథీలతో సమానంగా తొలి స్థానంలో భువీ నిలిచాడు. భువీ ఇప్పటివరకు 59టీ20 మ్యాచ్లలో పవర్ప్లేలో 33వికెట్లు పడగొట్టాడు.
అలాగే 5.66ఎకానమీతో పవర్ ప్లేలో అతని బౌలింగ్ కొనసాగింది. ఇకపోతే మంగళవారం టీమిండియా దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో తలపడనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగబోయే మూడో టీ20ల్లో భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో ఒక్క వికెట్ తీసిన.. టీ20 క్రికెట్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు నెలకొల్పుతాడు.
సిరీస్ చేజారకూడదంటే వైజాగ్లో భారత్ తప్పక గెలవాల్సి ఉంటుంది. భువనేశ్వర్ తన నిప్పులు చెరిగే ప్రదర్శన చేయడంతో పాటు మిగతా బౌలర్ల నుంచి మంచి ప్రదర్శన రావాల్సిన అవసరముంది. ఇతర బౌలర్లు భువనేశ్వర్కు కొంత మద్దతును అందించినా మ్యాచ్ స్వరూపం వేరేలా ఉంటుంది. ఇకపోతే ఈ మ్యాచ్లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఎవరికీ తుది జట్టులో అవకాశం లభిస్తుందో ఎవరికీ లభించదో మాత్రం సస్పెన్స్గా ఉంది. అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్లలో ఎవరో ఒకరు అరంగేట్రం చేసే అవకాశమైతే ఉంది.