ముంబై: టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ న్యూజిలాండ్ సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం తెలుస్తోంది. భువీకి అయిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. విండీస్తో మూడో టీ20 ముగిసిన తర్వాత గజ్జల్లో నొప్పిగా ఉందని భువీ జట్టు యాజమాన్యానికి తెలిపాడు. పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం అతడికి విశ్రాంతి అవసరమని సూచించింది. అయితే అతడికి శస్త్ర చికిత్స అవసరమని సమాచారం తెలుస్తోంది.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
'గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో భువనేశ్వర్ శస్త్రచికిత్స చేయించుకోవాలి. అది ఎప్పటికీ తప్పదు. అయితే ఎప్పుడు, ఎక్కడ చేయిస్తారో తెలియదు. భువీ కచ్చితంగా న్యూజిలాండ్ పర్యటనకు మాత్రం అందుబాటులో ఉండడు. అన్ని సర్దుకుంటే బహుశా ఐపీఎల్-13 సీజన్లోనే అతడి పునరాగమనం ఉండొచ్చు' అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
విండీస్తో మూడు వన్డేల సిరీస్కు భువనేశ్వర్ దూరమైన సంగతి తెలిసిందే. గాయపడిన భువీ స్థానంలో శార్దూల్ ఠాకూర్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే విండీస్తో జరిగిన టీ20 సిరీస్లోనే భువి పూర్తి ఫిట్నెస్తో లేడని తెలుస్తోంది. దీంతో ఆటగాళ్ల గాయాల విషయంలో ఎన్సీఏ బాధ్యతగా లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కెరీరే ప్రశ్నార్థకంగా మారింది.
ఇంగ్లాండ్లో ప్రపంచకప్-209 తర్వాత వెన్ను నొప్పితో భువనేశ్వర్ కుమార్ జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలలు విశ్రాంతి తీసుకున్నాడు. ఎన్సీఏ హెడ్ రాహుల్ ద్రావిడ్ సమక్షంలో శిక్షణ తీసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు గాయం కావడంతో కోలుకోవడానికి కనీసం రెండు నెలలు సమయం పట్టనుంది. విండీస్తో జరిగిన టీ20 సిరీస్లో భువీ పొదుపుగా బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే.