హైదరాబాద్: టీమిండియా బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ ఎంపికయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన చేసింది. బీసీసీఐ తాజా నిర్ణయం మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లకు గట్టి షాకిచ్చిందనే చెప్పాలి. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఇటీవలే ద్రవిడ్, జహీర్లను బ్యాటింగ్, బౌలింగ్ కన్సల్టెంట్లుగా నియమించిన సంగతి తెలిసిందే.

ఆ ఇద్దరినీ ఆయా పదవుల నుంచి తొలగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పదవులు వాళ్లకు మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది. మరోవైపు రవిశాస్త్రి కోరినట్లే సంజయ్ బంగర్ అసిస్టెంట్ కోచ్గా, ఆర్ శ్రీధర్ ఫీల్టింగ్ కోచ్గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే వరల్డ్కప్ వరకూ వీరిద్దరే కొనసాగనున్నట్లు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు.
ఇదిలా ఉంటే సీఓఏతో భేటీ అయిన తర్వాత మీడియాతో రవిశాస్త్రి మాట్లాడాడు. ద్రవిడ్, జహీర్ ఇద్దరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడానని, వాళ్ల సలహాలు, సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని అతను తెలిపాడు. ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఎంపిక అయిన తర్వాత పూర్తిస్థాయి బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్ పేరుని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) జహీర్ ఖాన్ని బౌలింగ్ కన్సల్టెంట్గా ఎంపిక చేసినప్పటికీ తనకు పూర్తిస్థాయిలో, జట్టు వెంబడి ఉండే బౌలింగ్ కోచ్ కావాలని రవిశాస్త్రి పట్టుబట్టిన సంగతి తెలిసిందే. కాగా, సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని సీఏసీకి టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక చేసే బాధ్యతల్ని మాత్రమే అప్పగించామని అయితే బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్లను సైతం ప్రకటించడంపై వినోద్ రాయ్ నేతృత్వంలో సీఓఏ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ల నియామకాన్ని పెండింగ్లో ఉంచాలని బీసీసీఐని ఆదేశించింది. ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఎంపికను మాత్రమే సీఓఏ పూర్తిస్థాయి సమర్ధించింది. అంతేకాదు సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రధాన కోచ్కు అప్పగించాలని కూడా పేర్కొంది. 2014 నుంచి 2016 మధ్య కాలంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్గా పని చేసిన కాలంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది.