IND vs PAK Viral Video: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య రెండో మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూశారు. లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి వారిని గట్టి దెబ్బ కొట్టింది. ఆదివారం సూపర్-4లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల విజయ లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగి సునాయాసంగా విజయం సాధించింది. అభిషేక్ శర్మ కేవలం 39 బంతుల్లో 74 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కొట్టిన సిక్సర్లు ఎంత చర్చనీయాంశమయ్యాయో.. ఆకుపచ్చ చీరలో మ్యాచ్ చూడటానికి వచ్చిన మహిళా అభిమాని కూడా అంతే ఆసక్తిని రేకెత్తించింది.
ఆదివారం ఏషియా కప్ సూపర్ 4 మ్యాచ్లో మైదానంలో భారత ఆటగాళ్లు పాకిస్తాన్ జట్టును చితకబాదుతుండగా.. మరోవైపు ఆకుపచ్చ చీరలో ఉన్న ఆ మహిళ బిగ్గరగా నినాదాలు చేస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టీమిండియాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఈ మహిళ ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ఆమె చేతులకు ఉన్న గాజులు కూడా త్రివర్ణ రంగులో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ ఆటగాళ్లను ఓడిస్తున్నప్పుడు.. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఈ మహిళ ప్రేక్షకుల్లో కూర్చుని 'బై బై పాకిస్తాన్' అంటూ నినాదాలు చేసింది. ఆమె మాట్లాడిన విధానం, ఆమె వేసుకున్న దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమె 'బైబై పాకిస్తాన్'నినాదాలు చేస్తున్న ఆ క్షణాలు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ మహిళ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది. ఆ వెంటనే ప్రజలు దాన్ని వేగంగా షేర్ చేయడం మొదలుపెట్టారు.

పాకిస్తాన్ను మరోసారి ఓడించిన భారత్
ఆసియా కప్ లీగ్ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించిన తర్వాత.. టీమిండియా సూపర్-4లో కూడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సహాయంతో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్తాన్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లారు. సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్లు తమ తప్పుల వికెట్లు కోల్పోయారు. చివరకు హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ భారత్ ను 18.5 ఓవర్లలో విజయ తీరాలకు చేర్చారు.