హైదరాబాద్: బరువు తగ్గడం, శారీరకంగా దృఢంగా తయారవడం వల్లే టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గత 12-18 నెలలుగా గాయాల బారిన పడకుండా అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్నాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫిజియో బ్రెట్ హరోప్ అన్నాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో జరిగిన టెస్టు సిరిస్ షమీ అద్భుత ప్రదర్శన చేయడంతో వరల్డ్ కప్ జట్టులో కూడా బెర్తు దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
గత ఆరు నెలలుగా 50 ఓవర్ల ఫార్మాట్లో చక్కటి ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి ఆరంభమయ్యే వన్డే వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో సైతం షమీకి సెలక్టర్లు చోటు కల్పించారు. షమి 5-6 కిలోలు తగ్గాడని, ఫిట్నెస్ పెంచుకునేందుకు బాగా కష్టపడ్డాడని పంజాబ్ ఫిజియో చెప్పాడు.
"ఇంతకుముందు కంటే షమీ ఇప్పుడు బాగా సన్నబడ్డాడు. అంతేకాదు దృఢంగా కూడా మారాడు. అతడు గాయపడకుండా ఉండడానికి ఇవి ప్రధాన కారణాలు. గాయాలకు దూరంగా ఉండడంతో అతడు మెరుగ్గా రాణిస్తున్నాడు" అని పంజాబ్ ఫిజియో హరోప్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్లో షమీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో పంజాబ్ విజయాల్లో మహ్మద్ షమీ, కేఎల్ రాహుల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరూ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో జాతీయ జట్టు ఫిజియో వారికి హ్యాండ్ ఔట్ ఇచ్చాడు.
ఈ హ్యాండ్ ఔట్లో సూచించిన ఆదేశాల మేరకు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు తమ ఫిట్నెస్ను కాపాడుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ సీజన్లో పంజాబ్ జట్టు 12 మ్యాచ్లాడగా ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి, ఏడు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది.