engaluru Stampede: రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీని తర్వాత ఆర్సీబీ జట్టు చిన్నస్వామి స్టేడియం బయట విక్టరీ పరేడ్, గ్రాండ్ సెలబ్రేషన్కు ప్లాన్ చేసింది. అయితే ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. ఇలా జరిగిన తర్వాత ఆర్సీబీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొందరిని అరెస్ట్ కూడా చేశారు.
ఇప్పుడు ఈ ఘటనకు బాధ్యులను గుర్తిస్తారా లేదా అన్నది ప్రశ్న కాదు. దాని పర్యవసానాలు ఎంతవరకు వెళ్తాయనేది ప్రశ్న. ఈ ఘటనకు కారణం ఆర్సీబీ జట్టు అని.. ఐపీఎల్ 2026లో జట్టుపై నిషేధం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఆర్సీబీ యాజమాన్యంతో పాటు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం(KSCA)పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. బాధిత కుటుంబాల పిటిషన్లపై కోర్టు విచారణ కూడా ప్రారంభించింది.

ఇలాంటి పరిస్థితుల్లో బీసీసీఐ ముందు చాలా పెద్ద ప్రశ్న ఉంది. ఈ ఘటనకు కారణం ఆర్సీబీ జట్టు అని తేలితే.. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. దర్యాప్తుదారులు ఆర్సీబీ యాజమాన్యాన్ని ఈ ఘటనకు బాధ్యులుగా చేస్తే.. లీగ్ విశ్వసనీయతను కాపాడేందుకు బీసీసీఐ ఆర్సీబీపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బీసీసీఐ వారిపై పరిమిత సమయం వరకు నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుంది.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఆర్సీబీ ఫ్రాంచైజీతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్పై కేసులు నమోదు చేశారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసెలెతో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ కర్ణాట ప్రభుత్వం బెంగళూరు పోలీస్ కమిషన్ బి దయానంద్ను సస్పెండ్ చేసింది. సీఎం సిద్దరమయ్య పొలిటికల్ సెక్రటరీ కూడా విధుల నుంచి తొలగించారు. మరికొందరు ఉన్నతాధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది.