Bengaluru Stampede: జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయం సాధించి 18 ఏళ్ల తర్వాత తమ మొదటి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని జూన్ 4 బెంగళూరులో వేడుకలు నిర్వహించాలని ఫ్రాంచైజీన నిర్ణయించింది. అయితే ఈ ఆనందం విషాదంగా మారింది. బెంగళూరులో వేడుకలు జరుపుకోవడానికి గుమిగూడిన లక్షలాది అభిమానుల మధ్య అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటన తర్వాత జూన్ 3న ఆర్సీబీ మేనేజ్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA)పై కేసు నమోదు చేయబడింది. సంబరాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈవెంట్ ఆర్గనైజర్తో పాటు ఫ్రాంచైజీ చెందిన నలుగురు అధికారులను అరెస్ట్ చేశారు. ఆర్సీబీ ఎగ్జిక్యూటీవ్ నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేశారు. డీఎన్ఏ ఈవెంట్ మేనేజర్ సునీల్ మాథ్యూన్ కూడా పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరో ఇద్దర్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు బెంగళూరు తొక్కిసలాట కేసులో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అధికారులకు భారీ ఉపశమనం లభించింది.

జూన్ 9న విచారణ
బెంగళూరు తొక్కిసలాట కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్(KSCA) అధికారులకు అరెస్టుల నుంచి కర్ణాటక హైకోర్టు రక్షణ కల్పించింది. ఈ ఘటనకు సంబంధించి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్పై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదిలా ఉండగా.. ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలేను జూన్ 6న ఉదయం దుబాయ్ వెళ్తుండగా విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. నిఖిల్ తన అరెస్టును సవాల్ చేశారు. ఈ కేసులో అటార్నీ జనరల్ మాట్లాడుతూ.. ఈ రోజు(జూన్ 6) ఉదయం నిఖిల్ను దుబాయ్ వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగినవ్వాలని.. అవసరమైతేనే అరెస్టులు ఉంటాయని ఆయన అన్నారు. అయితే నిఖిల్ సోసాలే అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై కర్ణాటక హైకోర్టు జూన్ 9న విచారణ జరపనుంది.