న్యూజిల్యాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తరఫున అత్యుత్తమంగా ఆడింది సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే అనడంలో అతిశయోక్తి లేదు. రెండో టీ20లో అజేయ శతకంతో నిలిచిన అతను.. భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ గైర్హాజరీలో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అతను.. తనకు దక్కిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధనాధన్ షాట్లతో అదరగొట్టాడు. ఓపెనర్గా వచ్చిన రిషభ్ పంత్ (13 బంతుల్లో 6) పూర్తిగా విఫలమైనా.. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 36) పెద్దగా రాణించకపోయినా తను మాత్రం తనకే చేతనైన స్టైల్లో ఇన్నింగ్స్ నిర్మించాడు. చివరకు భారత్కు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో మూడో టీ20లో కూడా అతను కచ్చితంగా ఆడతాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. అంటే మూడో టీ20లో గెలిస్తే భారత్కు సిరీస్ దక్కుతుంది. లేదంటే 1-1తో సిరీస్ డ్రా అవుతుంది.
ఇలాంటి సమయంలో సూర్యకుమార్ను పక్కన పెట్టేయాలని అంటున్నాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్. అతని స్థానంలో సంజూ శాంసన్ను ఆడించాలని అంటున్నాడు. సంజూకు అవకాశం ఇవ్వాలని చాలా మంది డిమాండ్లు చేస్తున్నారు. మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సంజూకు తగినన్ని అవకాశాలు ఇవ్వాలని ఇటీవలే అన్నాడు. ఈ క్రమంలోనే డీకే కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
'ప్రస్తుత లైనప్లో ఎవరికైనా రెస్ట్ ఇవ్వాలంటే సూర్యకుమార్కు మాత్రమే ఇవ్వాలి. మిగతా ఆటగాళ్లు ఇప్పుడే జట్టుతో కలిశారు. ఒక్క మ్యాచ్ ఆడగానే వారిని పక్కన పెట్టడం సరికాదు. కావాలంటే సూర్యకు మూడో మ్యాచ్లో విశ్రాంతినిచ్చి, వన్డేల్లోకి తీసుకోవచ్చు. ఈ స్థానంలో సంజూనే తీసుకోవచ్చు. ఎందుకంటే అతను ఫాస్ట్ బౌలింగ్, షార్ట్ బాల్స్ను ఎదుర్కోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి సూర్య స్థానంలో అతన్ని ఆడించాలని కోరుకుంటున్నా' అని డీకే చెప్పాడు.