
చెన్నై: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, రోరీ బర్న్స్ శనివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ ఆరంభించారు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్లో ఈ ముగ్గురూ ఆడలేదు. గతవారమే భారత్కు చేరుకున్న వీరు శుక్రవారంతో ఆరు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. మూడోసారి నిర్వహించిన కరోనా టెస్టుల్లోనూ నెగెటివ్ రావడంతో నేటి నుంచి ప్రాక్టీస్ ప్రారంభించారని ఆ జట్టు మీడియా మేనేజర్ డానీ రూబెన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ ) బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్కు అధిక పనిభారం నేపథ్యంలో విశ్రాంతినిచ్చింది. మరోవైపు రోరీ బర్న్స్ సతీమణి ఇటీవలే బిడ్డకు జన్మనివ్వడంతో పితృత్వపు సెలవులు తీసుకున్నాడు. ఈ క్రమంలో గతవారం చెన్నై చేరుకున్న ముగ్గురూ క్వారంటైన్లో ఉన్నారు. ఇక మిగతా ఇంగ్లాండ్ ఆటగాళ్లకు శుక్రవారం రెండోసారీ కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని రూబెన్ తెలిపారు. వీరంతా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు మూడురోజుల పాటు ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు.
ప్రస్తుతం భారత ఆటగాళ్లు కూడా క్వారంటైన్లో ఉన్నారు. క్వారంటైన్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 2 నుంచి సాధన చేయనున్నారు. ఇంగ్లాండ్, టీమిండియా ఫిబ్రవరి 5-9 వరకు తొలి టెస్టు, 13-17 వరకు రెండో టెస్టు చెన్నైలోనే ఆడనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ వేదికగా మూడో టెస్ట్, ఇదే వేదికలో మార్చి 4న నాలుగో టెస్ట్ ప్రారంభంకానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ భారత పర్యటనలో 4 టెస్ట్లు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది.
టెస్ట్ సిరీస్లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో రెండో టెస్ట్ నుంచి అందుబాటులో ఉంటాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాహం థోర్ ప్రకటించాడు. తొలుత బెయిర్స్టోకు తొలి రెండు టెస్ట్లకు విశ్రాంతి కల్పించాలని భావించిన ఆ జట్టు మేనేజ్మెంట్.. అనూహ్యంగా అతను రెండో టెస్ట్కు జట్టుతో కలుస్తాడని ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టెస్ట్ సిరీస్లో కెప్టెన్ జో రూట్ తరువాత అత్యధిక పరుగులు చేసిన బెయిర్స్టోను తొలి రెండు టెస్ట్లకు విశ్రాంతి కల్పించడంపై విమర్శలు రావడంతో మేనేజ్మెంట్ అతన్ని రెండో టెస్ట్కు అందుబాటులో ఉండాలని ఆదేశించింది.