
ప్రపంచ ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఒక మహిళా క్రికెటర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన గౌరవం మరే మహిళా క్రికెటర్కూ దక్కలేదు. ఆస్ట్రేలియా మాజీ సారధి, ఆ జట్టుకు రెండు ప్రపంచకప్లు అందించిన బెలిండా క్లార్క్ విగ్రహాన్ని ఎస్సీజీలో గురువారం నాడు ఆవిష్కరించారు. ఇక్కడ ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ రెండో రోజు ఆట మొదలవడానికి ముందే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం గమనార్హం.
ఆస్ట్రేలియా తరఫున ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడిన బెలిండా.. 1997, 2005లో ఆ జట్టుకు వరల్డ్ కప్లు అందించింది. అంతేకాదు, మహిళల క్రికెట్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ సాధించిన క్రీడాకారిణి కూడా ఆమెనే. ఇలా ఆమెను గౌరవించాలని 2021లోనే అనుకున్నారట. అప్పుడే ఎస్సీజీలో ప్రముఖ క్రికెటర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అయితే మంగళవారం వరకు కూడా ఆ విగ్రహం ఎవరిదనే విషయాన్ని వెల్లడించలేదు. ఇక్కడ ఇప్పటి వరకు 73 మంది పురుష క్రికెటర్ల విగ్రహలను ఏర్పాటు చేశారు. కానీ ఒక్క మహిళా క్రికెటర్ విగ్రహం కూడా ఆవిష్కరించలేదు. బెలిండా విగ్రహమే మహిళలకు ఈ గౌరవం దక్కడం ఇదే తొలిసారి.

ఎస్సీజీలో ఫ్రెడ్ స్పోఫోర్త్, రిచీ బెనాడ్, స్టాన్ మెక్కేబ్, స్టీవ్ తదితరుల విగ్రహాల సరసన బెలిండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన ఎస్సీజీ అధికారులు చాలా సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ కూడా దీన్నొక అరుదైన ఘట్టంగా అభివర్ణించారు. 'బెలిండా క్లార్క్కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం చూసి చాలా థ్రిల్ ఫీలవుతున్నా. ఒక మహిళా క్రికెటర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఆమె ఆస్ట్రేలియాకు ఎన్నో గొప్ప విజయాలు అందించడమే కాదు. ప్రస్తుత తరంలో ఈ ఆట ఆడే స్ఫూర్తి రగిలించింది' అని కొనియాడారు.