ముంబై: ఇంగ్లాండుతో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు గడువు సమీపిస్తోంది. ఈ సమయంలో బీసీసీఐ చేతులెత్తేసింది! భారత్లో పర్యటన ముగిసే వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఖర్చులు భరించలేమని, మీవి మీరే చూసుకోవాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాసింది.
లోధా కమిటీ సిఫార్సుల అమలు పైన సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీసీఐ ఇరుకున పడింది. ఇందులో భాగంగా బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశారు. హోటల్, ప్రయాణ ఖర్చులను మీ బోర్డే పెట్టుకోవాలని అందులో కోరారు.

సుప్రీం కోర్టు ఆదేశాలతో రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎటువంటి నిధులు మంజూరు చేయలేకపోతున్నామని, అందువల్ల ఇరు బోర్డుల పరస్పర ఒప్పందంలో భాగమైన ఆర్థికపరమైన ఖర్చులను మీరే భరించాలని, ఇది బాధాకరమని ఆ లేఖలో పేర్కొంటూ, క్షమాపణలు కూడా కోరారు.
ఇరు బోర్డుల మ్యుచువల్ అగ్రిమెంటును అమలు చేసే స్థితిలో ప్రస్తుతం బీసీసీఐ లేదని, ఆ ఖర్చులను ఈబీసీనే భరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. సిరీస్ యథావిధిగా ఉంటుందని, ఇబ్బంది ఉండదని, బీసీసీఐ నిర్ణయంతో సిరీస్ రద్దు చేసుకునే ఆలోచన లేదని చెప్పింది.