బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి చెందటం వల్ల ప్లేయర్స్, స్టాఫ్ కు సంబంధించిన విషయాల్లో బీసీసీఐ కఠిన నిబంధనలు రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూల్స్ విషయంలో బీసీసీఐ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్లేయర్స్ తమ కుటుంబసభ్యులను వెంట తీసుకెళ్లే విషయంలో నిబంధనను కాస్త సడలించినట్లు తెలిసింది.
నో ఫ్యామిలీ రూల్ పై భిన్నాభిప్రాయాలు..
వరుస పర్యటనల్లో టీమిండియా విఫలమవ్వడంతో.. ఆస్ట్రేలియా టూర్ తర్వాత క్రికెటర్లతో కలిసి వాళ్ల కుటుంబ సభ్యులు వెంట రాకూడదని నిబంధనను తీసుకొచ్చింది బీసీసీఐ. దీంతో ఈ కొత్త రూల్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు ఈ నిబంధనకు మద్దతు పలకగా.. మరికొందరు ఇది కరెక్ట్ కాదని అన్నారు. భార్యా పిల్లలకు దూరంగా నెలల తరబడి ఇతర దేశాల్లో గడపాలంటే ఆటగాళ్లకు కష్టంగా ఉంటుందని కొందరు అంటుండగా.. అలా దూరంగా ఉంటేనే ఆటపై క్రికెటర్స్ ఫోకస్ చేస్తారని మరికొందరు వాపోయారు. అయినప్పటికీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ నో ఫ్యామిలీ రూల్ ను పాటించాలని బీసీసీఐ పేర్కొంది.

బీసీసీఐ యూటర్న్..
కానీ ఇప్పుడు తాజాగా ఈ నో ఫ్యామిలీ రూల్ పై బీసీసీఐ యూ టర్న్ తీసుకుంది. ఈ నిబంధన నుంచి ఆటగాళ్లకు కాస్త ఊరటనిచ్చింది. దుబాయ్కు ప్లేయర్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్ ను వెంట తెచ్చుకోవచ్చని బోర్డు చెప్పినట్లు క్రికెటర్ వర్గాలు తెలిపాయి. అయితే, ఇందుకోసం ఓ షరతు పెట్టినట్లు తెలిసింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్కు మాత్రమే ప్లేయర్స్ తమ వెంట ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకొచ్చుకునేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే వెంట తీసుకొచ్చుకునే ముందు బోర్డుకు అభ్యర్థన చేసుకోవాలట. అప్పుడు బోర్డు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తుందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.