BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI).. ఇండియాలో క్రికెట్ను నియంత్రించే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. భారత క్రికెట్ జట్లు ఆడే మ్యాచ్లను బీసీసీఐ నియంత్రిస్తూ ఉంటుంది. ఇలా ప్రతి దేశానికి ఓ క్రికెట్ బోర్డు ఉంటుంది. ఆ సంస్థల కనుసన్నల్లోనే ఆయా దేశాల క్రికెట్ జట్లు ఉంటాయి. దేశం కోసం క్రికెట్ ఆడే ప్లేయర్ల బాగోగులను ఆయా దేశాల క్రికెట్ బోర్డులు చూసుకుంటాయి. అయితే ప్రస్తుతం బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రీడా సంస్థ నిలిచింది. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) దశ తిరిగిపోయింది. ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఇబ్బంది పడిన బీసీసీఐ.. ఇప్పుడు నోట్ల కట్టల్లో మునిగి తేలుతుంది. గత ఐదేళ్లలో బీసీసీఐ సంపద మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకుందాం.
రికార్డు స్థాయికి చేరిన బ్యాంక్ బ్యాలెన్స్
నివేదిక ప్రకారం.. కేవలం 12 నెలల వ్యవధిలోనే బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.20,686 కోట్లకు చేరింది. 2019లో బీసీసీఐ బ్యాంకు బ్యాలెన్స్ 6,059 కోట్లు ఉండగా.. ఇప్పుడు రూ.20,686 కోట్లకు చేరుకుని ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ సంస్థగా నిలిపింది. ఈ పెరుగుదల రాష్ట్ర సంఘాలకు చెల్లించాల్సిన తర్వాత మిగిలిందని బీసీసీఐ కార్యదర్శి వెల్లడించారు. ఈ నివేదిక సెప్టెంబర్ 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో ఆమోదించబడుతుంది.

ఐదేళ్లలోనే రూ.14,627 కోట్లు
2019 నుంచి గత ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయం రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. ఐదేళ్ల కాలంలోనే బీసీసీఐకి రూ.రూ.14,627 కోట్ల ఆదాయం లభించింది. ఇది కేవలం గత ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 4,193 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరాయి. అంతే కాకుండా.. బీసీసీఐ సాధారణ నిధి కూడా 2019లో ఉన్న రూ.3,906 కోట్ల నుంచి రూ.7,988 కోట్లకు పెరిగింది. ఈ ఘనమైన వృద్ధి బీసీసీఐ ఆర్థిక బలం, ఐపీఎల్. ఇతర టోర్నమెంట్ల వాణిజ్య విలువ ఎంత ఉందో స్పష్టంగా చూపుతుంది.
వేల కోట్ల పన్ను చెల్లించిన బీసీసీఐ
బీసీసీఐ కేవలం ఆదాయాన్ని పెంచుకోవడం మాత్రమే కాకుండా.. పారదర్శకతకు కట్టుబడి వేల కోట్ల రూపాయల పన్నును కూడా ప్రభుత్వానికి చెల్లించడం విశేషం. బీసీసీఐ ఆర్థిక సంవత్సరం 2023-24 కోసం దాదాపు రూ.3,150 కోట్ల పన్నును చెల్లించింది. ఇది ఇండియా ఏ క్రీడా సంస్థ కూడా ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించని రికార్డు. ఈ పన్ను చెల్లింపు బీసీసీఐ ఆర్థిక వృద్ధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు క్రీడా సంస్థ సహకారాన్ని సూచిస్తుంది. ఈ లెక్కలు బీసీసీఐ కేవలం ఒక క్రీడా సంస్థ మాత్రమే కాదని.. ఓ శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందని రుజువు చేస్తున్నాయి. ఐపీఎల్, మీడియా హక్కులు, ఇతర స్పాన్సర్ షిప్ ల ద్వారా బీసీసీఐ తన సంపదను పంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.