Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత తలెత్తిన వివాదంపై బీసీసీఐ తొలిసారి స్పందించింది. భారత్తో ఓడిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించినందుకు పాకిస్థాన్ చేసిన ఆరోపణలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పాకిస్థాన్కు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఈ వివాదంపై పాకిస్థాన్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ.. భారత క్రికెట్ బోర్డు మాత్రం ప్రశాంతంగా, ధీమాగా వ్యవహరిస్తోంది.
కేవలం గెలుపుపైనే దృష్టి
పాకిస్థాన్ మీడియా, అభిమానులు ఈ సంఘటనపై ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడాలని నిర్ణయించుకుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా పాకిస్థాన్ను 25 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఓడించి తమ సత్తా చాటింది. ఈ అద్భుతమైన విజయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆటగాళ్లతో చేతులు కలపకపోవడం, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్పై పాకిస్థాన్ చేసిన ఫిర్యాదులు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మోహసిన్ నఖ్వీ వ్యాఖ్యల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ను లైట్ తీసుకునన బీసీసీఐ
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. " భారత్ అద్భుతమైన విజయం సాధించిందని మాత్రమే నేను చెప్పగలను. ఇది కేవలం ఒక గొప్ప విజయం. అంతకు మించి ఏమీ లేదు. మనం ఆ విజయాన్ని ఆస్వాదించాలి. ఇతరులు మాట్లాడే మాటలపై దృష్టి పెట్టకూడదు. దాని గురించి మనం కలత చెందాల్సిన అవసరం లేదు." అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో పాకిస్థాన్ గురించి మాట్లాడే స్థాయి తమకు లేదని, వారి ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. మనం గెలుపును ఆస్వాదించడంపైనే దృష్టి పెట్టాలి తప్ప, ఇతరులు చేసే ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన పరోక్షంగా పాకిస్థాన్కు చురకలంటించారు.
ప్రస్తుతం భారత జట్టు సూపర్-4కు చేరుకుంది. ఒకవేళ పాకిస్థాన్ కూడా సూపర్-4కు అర్హత సాధిస్తే సెప్టెంబర్ 21న మరోసారి ఇరు జట్లు తలపడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో కూడా భారత్ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని బీసీసీఐ ఆశిస్తోంది. ఇదిలా ఉండగా.. ఐసీసీ నియమాల ప్రకారం రెండు జట్ల ఆటగాళ్లు చేతులు కలపడం తప్పనిసరి కాదని ఇప్పటికే స్పష్టమైంది. అయినప్పటికీ పాకిస్థాన్ ఈ అంశాన్ని వివాదాస్పదం చేస్తూ.. ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తానికి ఈ వివాదంలో పాకిస్థాన్ది అనవసర రాద్ధాంతమని బీసీసీఐ కార్యదర్శి వ్యాఖ్యలతో తేలిపోయింది.