BCCI: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడిన తర్వాత బీసీసీఐ రంగంలోకి దిగింది. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) ఐసీసీకి లేఖ రాసింది. రాబోయే ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్థాన్లను ఒకే గ్రూప్లో ఉంచవద్దని బీసీసీఐ ఐసీసీని అభ్యర్థించింది. ఐసీసీ ఈవెంట్లలో కూడా క్రికెట్ మైదానంలో రెండు దేశాల మధ్య ఘర్షణలను తగ్గించాలని లేదా తొలగించాలని బోర్డు కోరుకుంటోంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపేశారు. ఈ క్రమంలో దేశం మొత్తం ఆగ్రహంతో రగులుతోంది. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్ కు గుణపాఠం నేర్పడానికి సిద్ధమవుతోంది.
ఐసీసీకి లేఖ రాసిన బీసీసీఐ
పహల్గామ్లో జరిగిన హృదయ విదారక ఉగ్రదాడి తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో జరిగే ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్థాన్లను ఒకే గ్రూపులో ఉంచవద్దని కోరుతూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది. క్రిక్బజ్లోని ఒక నివేదిక ప్రకారం.. ఐసీసీ ఈవెంట్లలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలను తగ్గించాలని బీసీసీఐ కోరుకుంటోంది. రాజకీయ సంబంధాలు క్షీణించడం వల్ల రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ చాలా కాలంగా నిలిపివేయబడింది. బీసీసీఐ డిమాండ్ ను ఐసీసీ అంగీకరిస్తే పాకిస్థాన్ కు పెద్ద ఎదురుదెబ్బ తగలవచ్చు.

మహిళల ప్రపంచకప్లో తలపడనున్న పాక్, భారత్
ఈ సంవత్సరం ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ భారత గడ్డపై జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. ఐసీసీ, బీసీసీఐ, పీసీబీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ జట్టు భారత్ కు రాదు. తటస్థ వేదికలో తన మ్యాచ్లను ఆడుతుంది. 2025 సంవత్సరంలో ఆసియా కప్ కూడా నిర్వహించబడుతుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు మ్యాచ్లు జరగనున్నాయి. అయితే ఇప్పుడు ఆసియా కప్ షెడ్యూల్ ఎలా తయారు చేయబడుతుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇటీవలే మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రస్తుత అధ్యక్షుడిగా కూడా అన్నారు.