టీమిండియా క్రికెటర్లకి 10 నెలలుగా జీతాల్లేవ్!!

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్న విషయం తెలిసిందే. దేశంలో క్రికెట్ పరంగా వచ్చే ఆదాయంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని సైతం శాసిస్తోంది. అలాంటి బీసీసీఐ గత పది నెలలుగా తమ ఆటగాళ్లకు జీతాలివ్వట్లేదు. వినడానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే అసలు నిజం. బీసీసీఐ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఈ విషయం అర్థమవుతోందని ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది.

గతేడాది అక్టోబరు నుంచి:
ప్రపంచంలోనే సుసంపన్నమైన క్రికెట్ బోర్డుగా విరాజిల్లుతున్న బీసీసీఐ.. గత ఏడాది అక్టోబరు నుంచి ఆటగాళ్లకి జీతాలతో పాటు మ్యాచ్ ఫీజుల్ని కూడా చెల్లించకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రతి ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూపంలో బీసీసీఐకి సుమారు రూ.2000 నుంచి రూ.4000 కోట్లు ఆదాయం చేకూరుతున్నట్లు సమాచారం. అయినా వార్షిక కాంట్రాక్టు జాబితాలోని 27 మంది ఆటగాళ్లకు గత అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ బీసీసీఐ డబ్బులు ఇవ్వలేదు.

మ్యాచ్ ఫీజులు కూడా:
టీమిండియా క్రికెటర్లకి ఒక టెస్టు మ్యాచ్కి రూ. 15 లక్షలు, వన్డేకి రూ. 6 లక్షలు, టీ20కి రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజు రూపంలో బీసీసీఐ చెల్లిస్తోంది. ఈ క్రమంలో నిరుడు డిసెంబర్ నుంచి టీమిండియా ఆడిన రెండు టెస్టులు, తొమ్మిది వన్డేలు, ఎనిమిది టీ20ల మ్యాచ్ ఫీజులు కూడా ఆటగాళ్లకు ఇంకా అందలేదు. అలానే సెంట్రల్ కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బు కూడా ఆటగాళ్లకి గత ఏడాది నుంచి అందడం లేదు. కాంట్రాక్టు ఆటగాళ్లు అందరికీ కలిపి ఏడాదికి రూ.99 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.

నాలుగు వాయిదాల రూపంలో:
భారత్ తరఫున అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్లు ఆడే క్రికెటర్లకి బీసీసీఐ ఏటా సెంట్రల్ కాంట్రాక్ట్ ఇస్తుంది. 27 మందితో కూడిన ఈ కాంట్రాక్ట్ని ఎ+, ఎ, బి, సి గ్రేడ్లుగా ఉంటుంది. ఎ+ గ్రేడ్లోని ఆటగాళ్లకి ఏటా రూ.7 కోట్లు, ఎ కేటగిరీ క్రికెటర్లకి రూ. 5 కోట్లు, బి గ్రేడ్లో ఉన్న వారికి రూ. 3 కోట్లు, సి కేటగిరీ ఆటగాళ్లకి రూ. 1 కోటిని చెల్లించనుంది. టెస్టు, వన్డే, టీ20ల్లో రెగ్యులర్గా ఆడుతున్న ఆటగాళ్లకి మాత్రమే ఎ+ గ్రేడ్ని బీసీసీఐ ఇస్తోంది. ఈ ఏడాది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకి మాత్రమే ఆ కేటగిరీలో చోటు దక్కింది. వీటిని ఏడాదికి నాలుగు వాయిదాల రూపంలో చెల్లిస్తుంది. అయితే గత పది నెలలుగా బీసీసీఐ ఎలాంటి డబ్బు అందజేయలేదని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు.

క్రికెట్ వెస్టిండీస్ కూడా:
మరోవైపు కరోనాతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆర్థిక సంక్షోభంలోకి దిగజారాయి. మరీ ముఖ్యంగా క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తమ ఆటగాళ్లకు జీతాలు చెల్లించేందుకు నిధులు లేక విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెటర్లతో పాటు, దేశవాళీ ఆటగాళ్లకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేకపోయింది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఆర్థిక ఇబ్బంద్దుల్లో ఉన్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications