క్రికెట్ ప్రేమికులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన వన్డే వరల్డ్ కప్కు ముహూర్తం ఫిక్స్ అయింది. దీంతో అందరూ తమ ఫేవరెట్ మ్యాచులు లైవ్లో చూసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఇండియన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
దీన్ని లైవ్లో చూసేందుకు ఇప్పటికే అహ్మదాబాద్లో హోటల్స్ అన్నీ బుక్ చేసేసుకున్నారు కూడా. హోటల్స్ దొరకని వాళ్లయితే నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్లో కూడా బెడ్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లందరికీ మరో ఎగ్జయిటింగ్ వార్త వచ్చేసింది.

త్వరలోనే వరల్డ్ కప్ మ్యాచుల టికెట్లను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టేస్తారట. ఆగస్టు 10న ఈ టికెట్ల అమ్మకాలు షురూ అవుతాయని తెలుస్తోంది. ఇటీవలే వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా కీలక ప్రకటన చేశాడు. కొన్ని బోర్డుల అభ్యర్థన మేరకు వరల్డ్ కప్ షెడ్యూల్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయని చెప్పాడు.
ఏవైనా రెండు మ్యాచుల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంటే.. దాన్ని 5-6 రోజులకు కుదించేలా ప్లాన్ చేస్తున్నట్లు జై షా చెప్పాడు. అలాగే మ్యాచుల వేదికలు మారవని అయితే.. తేదీలు, సమయాలు మారే అవకాశం ఉందన్నాడు. వీటిని కూడా వచ్చే నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోందట.
ఈ నెల 31లోపు రాష్ట్ర క్రికెట్ సంఘాలు టికెట్ ధరలను నిర్ణయించి, ఆ వివరాలు తమకు పంపాలని బీసీసీఐ తెలిపిందట. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇది కూడా పూర్తయితే టికెట్లను ఆన్లైన్లో అమ్మడం కూడా త్వరలోనే మొదలు పెట్టేస్తారని సమాచారం.
ఇదే క్రమంలో స్టేడియంలో మ్యాచులు చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ అందరూ కూడా తమ టికెట్లను ఆఫ్లైన్లో తీసుకురావలసిందేనని జై షా స్పష్టం చేశాడు. దీని కోసం మ్యాచులు జరిగే నగరాల్లో పలు చోట్ల టికెట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ఎక్కడైనా ఫ్యాన్స్ తమ టికెట్లు తీసుకోవచ్చని పేర్కొన్నాడు.