మరో అయిదు నెలల్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే వన్డే వరల్డ్ కప్ను చేజార్చుకున్న టీమిండియా పొట్టి కప్ను సాధించాలని కసిగా ఉంది. దానికి తగ్గట్టుగానే బీసీసీఐ, సెలక్టర్లు ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని తిరిగి టీ20 జట్టులో చేర్చారు. అయితే వన్డే వరల్డ్ కప్లో సంచలన ప్రదర్శన చేసిన షమి భవితవ్యం గురించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుంది.
వన్డే ప్రపంచక్ అనంతరం షమి టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. చీలమండ గాయంతో బాధపడుతున్న అతడు ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాడు. జనవరి 25 నుంచి ప్రారంభంకానున్న ఇంగ్లాండ్ టెస్టు సిరీస్కు అందుబాటులో ఉండేలా సిద్ధమవుతున్నాడు. అయితే రోహిత్, కోహ్లి, కేఎల్ రాహుల్తో పాటు షమి కూడా 2022 టీ20 ప్రపంచకప్ నుంచి టీ20 ఫార్మాట్కు దూరమయ్యాడు. ఆ తర్వాత వన్డే, టెస్టులపై ఫోకస్ పెట్టాడు.

అయితే గత టీ20 ప్రపంచకప్నకు కూడా షమి అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఏడాది వరకు పొట్టి ఫార్మాట్కు దూరమైన అతడిని సెలక్టర్లు ఎంపిక చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సారి షమితో అన్ని విషయాలు ముందుగానే చర్చించి, దానికి తగ్గట్టుగా అతడికి పని భారం తగ్గించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు షమితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్లో కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య కూడా పాల్గొనున్నారు.
''తన భవితవ్యంపై ఆలోచనలు తెలుసుకోవడానికి షమితో మీటింగ్ జరుగుతుంది. గత కొన్నేళ్లుగా షమిపై పనిభారం పెరుగుతోంది. ఈ మీటింగ్ షమితో అసలు దక్షిణాఫ్రికాలోనే జరగాల్సి ఉంది. కానీ గాయం కారణంగా అతడు జట్టుతో లేడు. అతిత్వరలోనే టీమిండియా మేనేజ్మెంట్, సెలక్టర్లు షమితో మాట్లాడతారు. ఐపీఎల్, టెస్టులు కాకుండా షమి ఎంతమేర క్రికెట్ ఆడాలనుకుంటున్నాడనే విషయంపై క్లారిటీ తీసుకుంటారు''
'' అయితే ఈ సమావేశంలో టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, రోహిత్ శర్మతో పాటు హార్దిక్ పాండ్య కూడా పాల్గొంటాడు. టీమిండియా గురించి తీసుకునే విషయాల్లో ఇప్పటికీ హార్దిక్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అతడి నిర్ణయం ఎంతో ముఖ్యం'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్ తరపున 23 టీ20లు ఆడిన షమి 24 వికెట్లు పడగొట్టాడు.