హైదరబాద్: జూన్ నెలలో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో జరిగే చారిత్రాత్మక ఏకైక టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడకపోవడాన్ని తప్పుగా చూడొద్దని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి విమర్శకులను కోరారు.
ఈ ఏడాది కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. అక్కడి పిచ్లు, స్థానిక పరిస్థితులకు అలవాటు పడాలనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్కు బయల్దేరి వెళ్లనున్నాడు. జూన్ నెల మొత్తం సర్రే జట్టు తరఫున కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు.
దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్లో రాణించాలనుకుంటున్న విరాట్ కోహ్లీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని అమితాబ్ చౌదరి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఆప్ఘనిస్థాన్తో ఆడకూడదన్న ఉద్దేశం కోహ్లీకి ఏమీ లేదు' అని తెలిపాడు.
'ఇంగ్లాండ్ గడ్డపై సవాల్ను ఎదుర్కొని భారత్ అభిమానులను సంతృప్తి పరచాలనే కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడేందుకు మొగ్గు చూపాడు. అందుకే మరికొందరు టెస్టు ఆటగాళ్లనూ అక్కడికి ముందుగానే పంపించాం. టెస్టు క్రికెట్పై ప్రత్యేక దృష్టి ఉంది కాబట్టే ఇలా చేస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్ కోసమైతే కాదు' అని అన్నాడు.
ఇదిలా ఉంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు జట్టుని ఎంపిక చేసిన సమయంలో ఓపెనర్లను కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఎందుకు పంపించలేదు అన్న ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కె ప్రసాద్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'కోహ్లీకి మాత్రమే అవకాశం వచ్చింది. మిగతా వారికి వచ్చిందో రాలేదో తెలియదు. వస్తే వారిని కూడా పంపిస్తాం' అని అన్నాడు.