ముంబై: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు బీర్ సీసాలతో ఫోటోలు దిగి, వాటిని సామాజిక అనుసంధాన వేదికలో పెట్టారు. దీని పైన బిసిసిఐ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా ప్రస్తుతం విండీస్లో ఉంది.
సముద్ర పైన విహరిస్తూ, బీరు సీసాతో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కలసి సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టారు. కేఎల్ రాహుల్ తన చేతిలో బీరు బాటిల్ పట్టుకుని ఉండగా, పక్కనే బిన్నీ, ఉమేశ్ యాదవ్లు కనిపిస్తున్న మరో ఫోటో హల్చల్ చేస్తోంది.

ఆటగాళ్ల తీరు పైన బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. స్టార్ క్రికెటర్లను అనుసరించే కోట్లాది మంది భారత యువతను దృష్టిలో పెట్టుకుని మెలగాలని టీమ్ మేనేజర్ రియాజ్ బగ్వాన్కు హితవు పలికారు.
సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టే ముందు బాధ్యతగా ఉండాలన్నారు. విజ్ఞతతో మెలగాలని బీసీసీఐ పెద్దలు కోరారు. ఆపై బీరు పీకుతూ పెట్టిన ఫోటోలను ఆటగాళ్లు తీసేసినప్పటికీ, అప్పటికే వైరల్ అయిన చిత్రాలు హల్చల్ చేస్తున్నాయి.