
హైదరాబాద్: ఐసీసీ నుంచి వచ్చిన మరో రిక్వెస్ట్ను బీసీసీఐ తోసి పుచ్చింది. ఐపీఎల్ టైమింగ్స్ మార్చాలంటూ ఇప్పటికే పలుమార్లు చేసిన ప్రతిపాదన కుదరదంటూ అదే టైమింగ్స్ ఖరారు చేసింది బీసీసీఐ. దీనిపై మళ్లీ చర్చను లేవనెత్తి విఫలమైంది ఐసీసీ. కోల్కత్తాలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లను రీ షెడ్యూల్ చేయాలని ఐసీసీ చేసిన విజ్ఞప్తిని సైతం బీసీసీఐ తోసిపుచ్చింది.
షెడ్యూల్ను మార్చే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసింది. ఏప్రిల్ 22 నుంచి 26 వరకు కోల్కత్తాలో ఐసీసీ అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కానీ అదే సమయంలో నైట్రైడర్స్కు కోల్కతాలో ఎలాంటి హోమ్ మ్యాచ్లు లేవు. దీంతో ఎలాగైనా తమ ప్రతినిధుల కోసం కొన్ని మ్యాచ్లు ఉండేలా షెడ్యూల్ను మార్చాలని ఐసీసీ.. బీసీసీఐని కోరింది.
షెడ్యూల్ ప్రకారం నైట్రైడర్స్ తన హోమ్ మ్యాచ్ ఏప్రిల్ 6న, మే 3న ఆడనుంది. ఏప్రిల్ 22 నుంచి 26 మధ్య హైదరాబాద్, ముంబై, ఇండోర్, బెంగళూరు, జైపూర్లో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ను మారిస్తే అంతా గందరగోళంగా తయారవుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ సమావేశానికి పీసీబీ చైర్మన్ నజమ్ సేథీ హాజరుకావడంపై అనిశ్చితి నెలకొని ఉంది.
కాగా, ఐపీఎల్ మ్యాచ్లు ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరగనున్నాయి. సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు కేటాయించిన సమయాల్లో ఎటువంటి మార్పులు లేకుండా యథావిధిగా పాత షెడ్యూల్ నే అనుసరించనున్నారు. మొదటి మ్యాచ్గా ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముంబై ఇండియన్స్తో తలపడనుంది.