
హైదరాబాద్: బీసీసీఐ ఆఫీసు బేరర్ల విదేశీ పర్యటనలపై తరచూ ప్రశ్నలు లేవనెత్తే క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ)కి ఊహించని షాక్ ఎదురైంది. దానికి కారణం బోర్డు జనరల్ మేనేజర్ (క్రికెట్ వ్యవహారాలు) సబా కరీమ్ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలనుకోవడమే. సబా కరీమ్ యుకె పర్యటనపై బీసీసీఐ కోశాధికారి అనిరుధ్ చౌదరి ప్రశ్నలు లేవనెత్తుతూ సీఓఏకు లేఖ రాశాడు.
బీసీసీఐ ఆపరేషన్స్ జీఎం సబాకరీం 9 రోజుల పాటు జరపబోయే యూకే పర్యటనకు రూ. 2.78 లక్షలు డీఏగా విడుదల చేయాలంటూ బోర్డు కోశాధికారి అనిరుధ్కు లేఖ వచ్చింది. దీనికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను చూపించాలని అనిరుధ్ సీఓఏను అడుగుతున్నాడు.
'కరీమ్ తొమ్మిది రోజుల ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో డీఏ కింద రూ.2.7 లక్షలు విడుదల చేయాలంటూ నాకు మెయిల్ వచ్చింది' అని అనిరుధ్ తెలిపాడు. ఒకవేళ దానికి అతను ఆమోదం తెలిపిన కూడా సీఓఏ అధ్యక్షుడు వినోద్ రాయ్, డయానాలను నాలుగు ప్రశ్నలు అడగాలనుంటున్నట్లు తెలిపాడు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు కావాలంటూ అనిరుధ్ చౌధరి.. సీఓఏకు లేఖ రాశారు.
'మొదటిది.. కరీమ్ను తమ దేశానికి రమ్మంటూ ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి ఏమైనా ఆహ్వానం వచ్చిందా? దాన్ని నిరూపించే ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా? రెండోది.. దానికి బీసీసీఐ ఆమోదం తెలిపినట్లు సాక్ష్యాలు, మూడోది.. తాజాగా ఎవరైనా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారా? ఇక చివరగా.. ఎవరైనా అధికార ప్రతినిధి వెళ్లుంటే అతను చేయని పనిని పూర్తి చేయడానికి కరీమ్ వెళ్తున్నాడా?' అని అనిరుధ్ ప్రశ్నించాడు.
అలాగే భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీ్సకు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌధురి వెళ్లాలనుకోగా.. దానిని సీఓఏ తిరస్కరించడాన్నీ అనిరుధ్ తన లేఖలో ప్రస్థావించారు. మరోవైపు కరీం పర్యటనపై ప్రశ్న లేవనెత్తినా ..డీఏ అనుమతి పత్రాలపై ఆయన సంతకం చేయడం గమనార్హం.