వాంఖడే వేదికగా న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్ (64) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన ప్లేయర్లు బ్యాట్లెత్తేశారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఆరు, గ్లెన్ ఫిలిప్స్ మూడు, హెన్రీ ఒక్క వికెట్ తీశారు.
ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ వైట్ వాష్కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక ఈ ఏడాది సొంతగడ్డపై భారత్ ఓడిన టెస్టులు నాలుగు. 1969 తర్వాత స్వదేశంలో ఓ ఏడాది అత్యధిక టెస్టులు ఓడటం ఇదే ప్రథమం. 148 పరుగుల లక్ష్యాన్ని సాధించలేక ఈ అపకీర్తి మూటగట్టుకుంది.

ఈ ఘోరపరాజయం అనంతరం బీసీసీఐ అనధికారిక సమావేశాన్ని నిర్వహించింది. మైదానంలోనే టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్తో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం బీసీసీఐ పెద్దలతో అగార్కర్ మాట్లాడాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో సహా నలుగురు సీనియర్లపై వేటుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రోహిత్, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లలో కనీసం ఇద్దరిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుందని సమాచారం.
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్కు టీమిండియా అర్హత సాధించకపోతే ఈ స్టార్ ఆటగాళ్లపై వేటు వేయాలని బోర్డు నిర్ణయించుకుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ అనంతరం జరిగే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సీనియర్లు లేకుండా జట్టును పంపించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టు ఇప్పటికే ఎంపిక చేయడంతో తర్వాత ఇంగ్లండ్తో జరగనున్న టెస్టు సిరీస్తో మార్పులు చేపట్టనున్నట్లు చెప్పారు.
రోహిత్ గత 10 ఇన్నింగ్స్ల్లో ఆరు సార్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. రెండు సార్లు 20 కంటే తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. మరోవైపు స్వదేశంలో కోహ్లి గత 25 ఇన్నింగ్స్ల్లో కేవలం 742 పరుగులే చేశాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్స్కు భారత్ క్వాలిఫై కావాలంటే ఆస్ట్రేలియాతో జరిగే అయిదు టెస్టుల సిరీస్ను 4-0తో గెలవాలి. అప్పుడే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా టైటిల్ పోరుకు చేరుతుంది. నవంబర్ 22 నుంచి అయిదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది.