బెంగళూరు: సరిహద్దు వివాదంతో భారత్లో చైనా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. చైనా బ్రాండ్లు, ఉత్పత్తులు కొనుగోలు చేయవద్దని.. అక్కడి యాప్లకు దూరంగా ఉండాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఊపందుకున్నాయి. అయితే భారత క్రికెట్కు కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను చైనా కంపెనీ (వివో) స్పాన్సర్షిప్ చేస్తోంది. ఇటీవలి వరకు మరో కంపెనీ 'ఒప్పో' టీమిండియా ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించగా.. ఇప్పుడున్న బైజూస్లో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలతో బీసీసీఐ తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. దీంతో వివోతో పాటు ఇతర ఐపీఎల్ వాణిజ్య ఒప్పందాలను సమీక్షించనున్నట్లు బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
గల్వాన్ లోయలో చైనా దళాల చేతుల్లో 20 మంది భారత జవాన్లు మరణించడంతో.. ఆ దేశ కంపెనీలతో ఒప్పందాలు తెగదెంపులు చేసుకోవాలన్న డిమాండ్లు ఎక్కువైన నేపథ్యంలో బీసీసీఐ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రిజేష్ పటేల్ నేతృత్వంలోని పాలక మండలి సమావేశం కానుంది. అయితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్గా ఉన్న వివో.. ఏడాదికి రూ.440 కోట్లతో 2022 వరకు ఒప్పందం చేసుకుంది. వివోతో పాటు చైనా కంపెనీ అలీబాబా పెట్టుబడిదారుగా ఉన్న పేటీఎం కూడా ఐపీఎల్ స్పాన్సర్లలో ఒకటి.
సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చే వారం ఐపీఎల్ స్పాన్సర్షిప్ ఒప్పందాలను సమీక్షించేందుకు పాలకమండలి సమావేశం నిర్వహించనున్నట్లు ఐపీఎల్ శుక్రవారం ఓ ట్వీట్ చేసింది. 'మా ధైర్యవంతమైన జవాన్ల బలిదానానికి కారణమైన సరిహద్దు వివాదంను గమనిస్తూనే ఉన్నాం. ఐపీఎల్ ఒప్పందాలను సమీక్షించడానికి పాలకమండలి వచ్చే వారం సమావేశం కానుంది' అని ట్వీట్ చేసింది.
Taking note of the border skirmish that resulted in the martyrdom of our brave jawans, the IPL Governing Council has convened a meeting next week to review IPL’s various sponsorship deals 🇮🇳
— IndianPremierLeague (@IPL) June 19, 2020
చైనా స్పాన్సర్షిప్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతున్న మాట వాస్తవమే అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ అన్నాడు. ఇప్పటికిప్పుడు వివోతో ఒప్పందం రద్దు చేసుకునే ఉద్దేశం లేదని ఇంతకుముందు ధుమాల్ చెప్పిన సంగతి తెలిసిందే. 'భావోద్వేగంతో స్పందిస్తున్నారు. దీన్ని పక్కనబెట్టి యథార్థంగా ఆలోచించండి. చైనా కంపెనీలకు మద్దతు ఇస్తున్నామా లేక అక్కడి నుంచి రాబడి అందుకుంటున్నామా అనే తేడా తెలుస్తుంది. చైనా కంపెనీల ఉత్పత్తుల్ని భారత్లో విక్రయించేందుకు అనుమతిస్తే మన వినియోగంతో వారికి డబ్బు వెళ్తుంది. అదే చైనా కంపెనీ వారి బ్రాండ్ ప్రమోషన్ కోసం మనకు చెల్లిస్తే అక్కడి నుంచి రాబడి వస్తుంది. అంటే భారత ఆర్థిక రంగానికి ఇది లాభించేది. టైటిల్ స్పాన్సర్ కోసం వివో కంపెనీ బీసీసీఐకి రూ. 440 కోట్లు చెల్లిస్తుంది. ఇందులో 42 శాతం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వస్తాయి' అని ధుమాల్ వివరించాడు.
ధోనీని ఆకర్షించేందుకు ఎంతో ప్రయత్నించా.. చివరకు..: అశ్విన్