ఆసియా కప్ ట్రోఫీ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దుబాయ్లో జరుగుతున్న ఐసీసీ కార్యనిర్వాహక బోర్డు సమావేశానికి హాజరు కావడం లేదని తెలుస్తోంది. ఈ సమావేశంలో ఆయనపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు ట్రోఫీని తక్షణమే అప్పగించాలని డిమాండ్ చేయనున్న నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ ఈ భేటీని తప్పించుకుంటున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐసీసీ 4 రోజుల సమావేశాలు నవంబర్ 4, 2025 నుంచి దుబాయ్లో ప్రారంభమయ్యాయి.
ఆసియా కప్ ట్రోఫీ వివాదంపై బీసీసీఐతో నేరుగా ఘర్షణను తప్పించుకోవడానికి మొహ్సిన్ నఖ్వీ కొత్త ప్లాన్ వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఐసీసీ సమావేశానికి హాజరు కావడం లేదని వార్తలు వస్తున్నాయి. భారత్ ఆసియా కప్ గెలిచిన తర్వాత ఏసీసీ (ACC) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ (పాకిస్తాన్ మంత్రి కూడా) చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. దీనితో మొహ్సిన్ నఖ్వీ ఆ ట్రోఫీని తన వెంట తీసుకెళ్లారు. అప్పటి నుంచి ట్రోఫీ ఇంకా భారత్కు అందలేదు. బీసీసీఐ ట్రోఫీని తిరిగి ఇవ్వాలని ఏసీసీకి లేఖ రాసినా స్పష్టమైన సమాధానం రాలేదు. దీంతో ఐసీసీ సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తుతామని, మొహ్సిన్ నఖ్వీ చర్యను తీవ్రంగా విమర్శిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.

నఖ్వీ గైర్హాజరుకు కారణం
కొన్ని నివేదికల ప్రకారం.. మొహ్సిన్ నఖ్వీ తన గైర్హాజరుకు దేశీయ రాజకీయ సమస్యలను కారణంగా చూపారు. అయితే ఆ రాజకీయ కారణాలు ఏమిటో స్పష్టంగా వెల్లడించలేదు. నఖ్వీ ఈ సమావేశానికి హాజరు కాకపోవడానికి బీసీసీఐ నుంచి ఎదురయ్యే తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణమని భావిస్తున్నారు. నవంబర్ 7, 2025 న జరగనున్న ఐసీసీ సమావేశానికి నఖ్వీ స్థానంలో పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుమైర్ సయీద్ హాజరుకానున్నారు. అయితే నఖ్వీ వీడియో కాల్ ద్వారా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని కూడా కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
టీమిండియాకు ట్రోఫీ ఎప్పుడు అందుతుంది?
ఐసీసీ సమావేశంలో బీసీసీఐ ఈ సమస్యను లేవనెత్తితే పీసీబీ, మొహ్సిన్ నఖ్వీ వద్ద స్పష్టమైన సమాధానం ఉండదు. ట్రోఫీని ఏసీసీ ఛైర్మన్ మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఏదీ లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ నఖ్వీని మందలించి, త్వరలోనే టీమిండియాకు ట్రోఫీని అప్పగించాలని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.