టీమిండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది కోసం బీసీసీఐ త్వరలో దరఖాస్తులు విడుదల చేయనుంది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్, సహాయ సిబ్బంది పదివీకాలం ముగియనున్న నేపథ్యంలో బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించనుంది. వాస్తవానికి హెడ్ కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ప్రపంచకప్ అనంతరం ముగిసింది. రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల కాంట్రాక్ట్ కూడా ముగిసింది. అయితే వచ్చే నెల 3 నుండి విండీస్ టూర్ ఉండడంతో శాస్త్రితో పాటు బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ల కాంట్రాక్ట్ను మరో 45 రోజులు పొడిగించారు. దీంతో వీరందరూ విండీస్ టూర్ వరకు జట్టుతో ఉండనున్నారు.
నేను సాధించిన మెడలే నా విమర్శకులకు సమాధానం: ద్యుతీ చంద్
సెప్టెంబరు 15 నుంచి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇప్పుడు సమయం లేకపోవడంతో దక్షిణాఫ్రికా సిరీస్ లోపు దరఖాస్తులు ఆహ్వానించి అన్ని పదవులను భర్తీ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. కోచ్లతో పాటు టీమ్ మేనేజర్ పోస్టుకు కూడా దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు సమాచారం. మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తర్వాత 2017లో టీమిండియా కోచ్గా రవిశాస్త్రి నియమితుడయ్యాడు. ఒకవేళ శాస్త్రి కోచ్గా కొనసాగాలనుకుంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిందే.
సుదీర్ఘకాలంగా భారత క్రికెట్ జట్టుకు సేవలందించిన ఫిజియో పాట్రిక్ ఫర్హాట్, ఫిట్నెస్ కోచ్ శంకర్ బసులు సెమీస్ మ్యాచ్ అనంతరం తమ పదవులకు రాజీనామా చేశారు. ఒప్పందం ప్రకారం 2019 ప్రపంచకప్ వరకు మాత్రమే పాట్రిక్, శంకర్ బసులు కొనసాగాలి. ఈ క్రమంలో ప్రస్తుత ప్రపంచకప్తోనే వీరి పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఫిజియోగా తాను తప్పుకొంటున్నట్లు పాట్రిక్ గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించగా.. శంకర్ బసు తన రాజీనామాను బీసీసీఐ అధికారులకు అందజేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగత ట్రైనర్గానూ శంకర్ బసు పని చేశాడు. ఫిజియో, ఫిట్నెస్ కోచ్ల పదవులకు కూడా బీసీసీఐ దరఖాస్తులు విడుదల చేయనుంది.