టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు సంబంధించి బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2026 జూన్తో ముగియనున్న అజిత్ అగార్కర్ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు అంటే జూన్ 2027 వరకు పొడిగించాలని బోర్డు భావిస్తోంది. అగార్కర్ హయాంలో భారత జట్టు అద్భుతమైన విజయాలను అందుకుంది. ముఖ్యంగా 2024 టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచ కప్లను భారత్ కైవసం చేసుకోవడంలో అగార్కర్ ఎంపిక చేసిన జట్లు కీలక పాత్ర పోషించాయి. 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకుని జట్టులో స్థిరత్వం కోసం అగార్కరే కొనసాగాలని బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సూర్య భాయ్కు గడ్డుకాలం?
మరోవైపు భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్నప్పటికీ.. వ్యక్తిగతంగా సూర్య బ్యాటింగ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 2025లో సూర్య స్ట్రైక్ రేట్ భారీగా పడిపోవడమే కాకుండా ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. 2026లో తిరిగి పుంజుకున్నట్లు కనిపించినా.. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో తక్కువ పరుగులకే వెనుదిరగడం సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది.

భవిష్యత్తు పర్యటనలే కీలకం
రాబోయే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలు సూర్యకుమార్ యాదవ్కు అగ్నిపరీక్షగా మారనున్నాయి. 2028లో లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో క్రికెట్ చేరనున్న నేపథ్యంలో అప్పటి వరకు సూర్య జట్టులో ఉంటాడా లేదా అనేది ఆయన ప్రస్తుత ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు సూర్యకు ఉన్నప్పటికీ.. 2028 నాటికి ఆయనకు 38 ఏళ్లు వస్తాయి కాబట్టి, యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలని సెలెక్షన్ కమిటీ భావిస్తోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వంటి యువ కెరటాలు దూసుకొస్తుండటంతో సూర్య తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే నిలకడగా రాణించాల్సిందే.
సెలెక్టర్ల వ్యూహం
బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంది. జట్టులో సీనియర్ల నుంచి యువతకు మార్పు సజావుగా సాగేలా అజిత్ అగార్కర్ పర్యవేక్షించారు. ఐపీఎల్ మ్యాచ్ల విరామ సమయంలో బీసీసీఐ ప్రతినిధులు అగార్కర్తో మాట్లాడి ఒప్పందం పొడిగింపుపై అధికారికంగా చర్చించనున్నారు. అగార్కర్, గంభీర్ ద్వయం 2027, 2028 మెగా ఈవెంట్ల కోసం పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.