ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ బుధవారం సమావేశం కానుంది. వాంఖడే స్టేడియం కాంప్లెక్స్లో రేపు రాత్రి 7.30 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ మెగావేలంతో పాటు కీలక నిబంధనలపై చర్చించనున్నారు. సమావేశం ఎజెండాలో అయిదు పాయింట్లు ఉన్నాయి. వాటిపై అన్ని ఫ్రాంచైజీల అభిప్రాయాలను తీసుకుని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోనుంది.
ఐపీఎల్-2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. గత నిబంధనల ప్రకారం ఈ మెగా ఆక్షన్లో సొంతం చేసుకున్న ఆటగాళ్లు ఒప్పందం మేరకు మూడేళ్ల పాటు ఫ్రాంచైజీతో కొనసాగాలి. అయితే నాలుగు నుంచి ఐదేళ్లకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని బీసీసీఐకి కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. కానీ మూడేళ్లకు ఒక్కసారి జరిగే పద్ధతినే కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుంది. సమావేశంలో జరిగే అయిదు పాయింట్లు ఏంటంటే..

ఐపీఎల్ ప్లేయర్ నిబంధనలపై చర్చ: ఈ పాయింట్పై సుదీర్ఘ చర్చ జరుగుతుంది. ప్లేయర్ల రిటెన్షన్ జాబితా, రైట్ టూ మ్యాచ్ కార్డు గురించి చర్చిస్తారు. కొత్త ఫ్రాంచైజీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రావడంతో గత మెగా వేలంలో రైట్ టూ మ్యాచ్ కార్డ్ రూల్ను తొలగించారు. ఈసారి తిరిగి తీసుకురావాలని ఫ్రాంచైజీలు ఒత్తిడి చేస్తున్నాయి. అలాగే రిటైన్డ్ ప్లేయర్ల పరిమితిని కనీసం అయిదుకు పెంచాలని కోరుతున్నాయి. వీటిపై నిర్ణయం తీసుకున్నారు.
మొదటి పాయింటులోనే ఆటగాళ్ల జీతం పరిమితి, ప్లేయర్ ట్రేడింగ్, క్యాప్డ్- అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి చర్చించనున్నారు. ప్రతి సీజన్లో సత్తాచాటే ప్లేయర్లకు ఇంక్రిమెంట్లు గురించి కూడా మాట్లాడనున్నారు. ఈ పాయింటుపై చర్చతోనే ఐపీఎల్ మెగా వేలం విధివిధానాల దాదాపు ఖరారైపోతాయి. ఇక రెండో పాయింటు విదేశీ ప్లేయర్ల గురించి. తుదిజట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య, వాళ్లపై విధించే పన్ను ఇతరత్రా విషయాలు చర్చలోకి వస్తాయి.
మూడో పాయింట్.. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై. దీనిపై చర్చ ఎక్కువసేపు సాగనుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తొలగించాలని పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆల్రౌండర్లకు భవితవ్యంపై ఇది ప్రభావం చూపుతుందని, రూల్ను తీసివేయాలని స్టార్ క్రికెటర్లు సైతం పేర్కొన్నారు. అయితే ఈ రూల్తో జట్టులో ఓ దేశీయ ప్లేయర్కు ఛాన్స్ వస్తుందని సపోర్ట్ కామెంట్లు కూడా ఉన్నాయి. మరోవైపు బ్రాడ్కాస్టర్స్ రూల్కు మద్దతు ఇస్తున్నారు. ఇక చివరి రెండు పాయింట్లు పూర్తిగా వాణిజ్యానికి సంబంధించినవి. ఐపీఎల్ గేమింగ్ రైట్స్, ఐపీఎల్ ప్రధాన వర్తకం గురించి లోతుగా చర్చించనున్నారు.