మహిళల టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. పేలవమైన ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఫలితంగా ఐసీసీ ఈవెంట్లలో భారత మహిళల జట్టుకు కప్ అందని ద్రాక్షగానే మిగిలింది. అంతేగాక ఈ సారి సెమీస్కు కూడా చేరుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై వేటుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హర్మన్ప్రీత్ కెప్టెన్సీ భవితవ్యంపై సెలక్షన్ కమిటీ, ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్లతో బీసీసీఐ సమావేశం కానుంది. 2025లో జరగనున్న వన్డే వరల్డ్ కప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగాటోర్నీలో విజేతగా నిలిచేలా కార్యచరణ సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తోంది.

2016లో టీ20 వరల్డ్ కప్లో భారత మహిళల జట్టు సెమీఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. ఈ దశలో మిథాలీరాజ్ నుంచి టీ20 జట్టు పగ్గాలను హర్మన్ప్రీత్ కౌర్ అందుకుంది. 2020 టీ20 ప్రపంచకప్లో జట్టును ఫైనల్కు చేర్చింది. కానీ విజేతగా జట్టును నిలవలేకపోయింది. కాగా, అక్టోబర్ 24 నుంచి న్యూజిలాండ్తో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. 2025 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్కు ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
వచ్చే మెగా టోర్నీ వరకు హర్మన్ప్రీత్కు అవకాశం ఇవ్వాలా లేదా కొత్త కెప్టెన్ను నియమించాలా అనే ఆలోచనలో బీసీసీఐ పడింది. హర్మన్ప్రీత్ను కెప్టెన్సీ నుంచి తప్పించినా జట్టులో బ్యాటర్గా ఆమె స్థానానికి డోకా లేదు. అయితే స్మృతి మంధానకు జట్టు పగ్గాలు అప్పగించి వన్డే వరల్డ్ కప్కు భారత జట్టును సిద్ధం చేసే యోచనలో బీసీసీఐ ఉంది. అలాగే హర్మన్ప్రీత్ను 2025 వరకు కొనసాగించాలని మరో ప్లాన్లో ఉంది. దీనిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.