వచ్చే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విషయంపై ప్రస్తుతం వివాదం జరుగుతోంది. మొత్తం పది వేదికల్లో ఈ మ్యాచులు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ జాబితాలో చోటు దక్కని రాష్ట్రాల బోర్డులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పంజాబ్ క్రీడాశాఖ మంత్రి అయితే బీసీసీఐ వివక్షతో వేదికలను సెలెక్ట్ చేసిందంటూ లేఖ కూడా రాశాడు. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
వరల్డ్ కప్ మ్యాచులు నిర్వహించే అవకాశం దక్కని వేదికలకు మంచి ఆఫర్ ఇస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా ఆయా రాష్ట్ర క్రికెట్ సంఘాలకు లేఖలు రాసినట్లు సమాచారం. ఈ లేఖల్లో వరల్డ్ కప్ వేదికలుగా ఎంపిక కాని రాష్ట్రాలకు కంపన్సేషన్ ఇవ్వాలని తాము అనుకున్నట్లు జై షా తెలిపాడు. దీని కోసం సమావేశంలో తాను ఒక ప్రతిపాదన చేసినట్లు వెల్లడించాడు.

'వరల్డ్ కప్ వేదికలుగా ఎంపికవని రాష్ట్రాలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో బీసీసీఐ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశాను. మెగాటోర్నీ మ్యాచులు నిర్వహించే ఛాన్స్ దక్కిన రాష్ట్రాలు.. ఆ తర్వాత జరిగే హోం సీజన్ భారత మ్యాచులు నిర్వహించే అవకాశాన్ని వాలంటరీగా వదులుకోవాలని కోరడం జరిగింది. దీనికి ఆయా రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి' అని జై షా వివరించాడు.
అయితే ఈ నిర్ణయం వార్మప్ మ్యాచులు నిర్వహించే కేరళ, అస్సాం రాష్ట్రాలకు వర్తించదని తెలియజేశాడు. హోం సీజన్ మ్యాచులు నిర్వహించేందుకు ఈ రెండు రాష్ట్రాలకు కూడా అవకాశం ఉందని చెప్పాడు. ఈ ప్రతిపాదనకు సమావేశంలో ఏకగ్రీవ ఆమోదం లభించినట్లు వివరించాడు. వరల్డ్ కప్ నిర్వహించే రాష్ట్రాల్లో ఆ తర్వాత జరిగే ద్వైపాక్షిక సీజన్ మ్యాచులు జరగబోవని, ఈ హక్కులను ఆయా రాష్ట్రాలే వదులుకున్నాయని స్పష్టం చేశాడు.