Asia Cup 2025: ఆసియా కప్పై ఢాకాలో జరగనున్న సమావేశంపై సందిగ్ధత నెలకొంది. బీసీసీఐ ఈ సమావేశానికి హాజరుకావడానికి నిరాకరించింది. దీని వెనుక పెద్ద కారణం కూడా బయటపడింది. ఆసియా కప్ సమావేశం వేదికను మార్చకపోతే, బీసీసీఐ టోర్నమెంట్ను బహిష్కరించే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం.. ఢాకాలో ఆసియా కప్కు సంబంధించిన సమావేశం జరిగితే, టోర్నమెంట్కు సంబంధించి తీసుకునే ఎలాంటి పరిష్కారాలనైనా తాము బహిష్కరిస్తామని బీసీసీఐ తెలిపింది. భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
"ఏసీసీ సమావేశం వేదికను ఢాకా నుండి వేరే చోటికి మార్చితేనే ఆసియా కప్ జరుగుతుంది. ప్రస్తుతం ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా కప్ కోసం భారత్పై అనవసరంగా ఒత్తిడి చేస్తున్నాడు. వేదికను మార్చమని అతనికి సూచించినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. సమావేశం ఢాకాలో జరిగితే, బీసీసీఐ ఎలాంటి తీర్మానాన్ని అయినా బహిష్కరిస్తుంది" అని ఓ నివేదిక పేర్కొంది.

బీసీసీఐకి ఇతర క్రికెట్ బోర్డుల మద్ధతు
నివేదిక ప్రకారం.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఒమన్ క్రికెట్ బోర్డులు కూడా ఢాకాలో జరగనున్న సమావేశానికి హాజరుకావడానికి నిరాకరించాయి. ఇన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ మొహ్సిన్ నఖ్వీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఏసీసీ నిబంధనల ప్రకారం.. భారత్ వంటి ప్రధాన దేశం సమావేశానికి హాజరుకాకపోతే ఏ నిర్ణయం కూడా చెల్లదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఇతర ప్రాంతంలో సమావేశాన్ని నిర్వహించకపోతే.. ఈ సమావేశానికి ఎటువంటి అర్థం ఉండదు. సమావేశానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున ఏసీసీ త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడిలో ఉంది.
భారత్ ఒత్తిడితో ఆసియా కప్ రద్దవుతుందా?
సెప్టెంబర్ 2025లో ఆసియా కప్ జరగాల్సి ఉంది. అయితే పరిస్థితులు ఇలాగే కొనసాగితే టోర్నమెంట్ వాయిదా పడవచ్చు లేదా రద్దు కూడా కావచ్చు. బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్లో కీలక భాగం. ఒకవేళ బీసీసీఐ టోర్నమెంట్లో పాల్గొనకపోతే పరిస్థితులు మరింత దిగజారవచ్చు.