
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీపై కరోనా ప్రభావం పడింది. టోర్నీకి సంబంధించిన పలువురు ఇప్పటికే వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. బయో బబుల్ వాతావరణంలో టోర్నీ జరుగుతున్నా.. బీసీసీఐ ఏర్పాట్లపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు కరోనా సోకింది. దీంతో సోమవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడింది. దీన్ని టోర్నీ పూర్తయ్యేలోపు మళ్లీ నిర్వహిస్తారని తెలిసింది. అయితే అదెప్పుడనేది ప్రస్తుతానికి తెలియరాలేదు.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదాన సిబ్బంది ఐదు మందికి తాజాగా కరోనా సోకిందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్లో ఉన్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, ఆ ఫ్రాంఛైజీకి చెందిన బస్సు క్లీనర్కు సైతం కరోనా సోకిందనే వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఆదివారం చెన్నై సిబ్బందికి వచ్చిన ఫలితాలు తప్పుడు రిపోర్టులని, సోమవారం వచ్చిన ఫలితాల్లో నెగిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. దాంతో చెన్నై జట్టులో ప్రస్తుతం ఎవరూ వైరస్ బారిన పడలేదని స్పష్టం అయింది.
ఢిల్లీ మైదాన సిబ్బంది ఐదుగురికి కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పుడు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ పెద్దల్లో ఆందోళన మొదలైంది. మంగళవారం రాత్రి ఢిల్లీలో జరిగే సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచుపైనా సందిగ్ధం నెలకొంది. మ్యాచ్ జరిగేది లేనిది రేపటి లోగా తేలనుంది. ఈ రోజు, రేపు ఉదయం మైదానం మొత్తాన్ని శానిటైజ్ చేస్తామని డీడీసీఏ అధికారి ఒకరు చెప్పారు. ఇక రాజస్థాన్, ముంబై, హైదరాబాద్, చెన్నై జట్లు మ్యాచుల కోసం మే 8 వరకు ఢిల్లీలోనే ఉండనున్నాయి.
ఐపీఎల్ 2021 ప్రారంభమై 25 రోజులు అవుతోంది. ఇప్పటికే సగం టోర్నీ ముగియగా.. బయో బుడగ పటిష్ఠంగానే ఉండటంతో బీసీసీఐ బోర్డు ఊపిరి పీల్చుకుంది. అయితే ఉన్నపళంగా ఆటగాళ్లు కరోనా బారినపడడంతో.. ఐపీఎల్ను వాయిదా లేదా రద్దు చేయాలంటూ బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతోంది. విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణను చాలా మంది తప్పబడుతున్నారు. ఇక ఐపీఎల్ 2021ను వెంటనే రద్దు చేయాలంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 'Cancel IPL' అనే హ్యాష్ ట్యాగ్తో మీమ్స్, సెటైర్లు, కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది.