టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లి శకం ముగిసింది. టీ20 వరల్డ్ కప్ అనంతరం ఈ స్టార్లు ఇద్దరూ పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రోహిత్, కోహ్లి బాటలోనే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా పయనించాడు. ఫైనల్ ముగిసిన ఒక రోజు తర్వాత టీ20లకు వీడ్కోలు పలికాడు.
అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆల్టైమ్ రికార్డులు సాధించారు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఈ ఇద్దరూ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 151 ఇన్నింగ్స్ల్లో రోహిత్ 32 సగటు, 140 స్ట్రైక్రేటుతో 4231 పరుగులు చేశాడు. అయిదు సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు బాదాడు. ఇక విరాట్ కోహ్లి 117 ఇన్నింగ్స్ల్లో 48 సగటు, 137 స్ట్రైక్రేటుతో 4188 పరుగులు చేశాడు. కోహ్లి ఓ శతకం, 38 అర్ధశతకాలు సాధించాడు.

టీ20ల్లోనే కాకుండా మిగిలిన ఫార్మాట్లలోనూ వీరిద్దరు భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే ఈ నేపథ్యంలో రోహిత్, కోహ్లిని దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తరహాలోనే బీసీసీఐ గౌరవించాలని సురేశ్ రైనా అన్నాడు. ధోనీ, సచిన్ జెర్సీ నంబర్లను బీసీసీఐ రిటైర్మెమెంట్ చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్లో సచిన్ 10, ధోనీ 7 జెర్సీ నంబర్లను మరో క్రికెటర్ ఉపయోగించుకోకుండా చేసింది.
అదే తరహాలో రోహిత్ శర్మ 45, విరాట్ కోహ్లి 18 జెర్సీ నంబర్లను రిటైర్మెంట్ చేయాలని బీసీసీఐని రైనా కోరాడు. టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్, కోహ్లికి ప్రత్యేక గౌరవం దక్కాలని కోరుకుంటున్నాని తెలిపాడు. వారిద్దరి జెర్సీ నంబర్లను రిటైర్ చేసి బీసీసీఐ కార్యాలయంతో గౌరవం ఉంచాలని అన్నాడు. ధోనీ, సచిన్ తరహాలోనే వీరిద్దరి జెర్సీలను ప్రత్యేకంగా ఉంచాలని కోరాడు. ఇలా చేయడం వల్ల భారత జట్టులోకి వచ్చే యువ క్రికెటర్లు మరింత స్ఫూర్తి పొందుతారని సురేశ్ రైనా పేర్కొన్నాడు.