ముంబై: భారత క్రికెట్ జట్టుకు కోచ్ను ఎంపిక చేసే ప్రక్రియను బీసీసీఐ వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 57 మంది అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితా నుంచి 21 మందితో కూడిన షార్ట్ లిస్ట్ రూపొందించి సీఏసీకి పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే తెలిపారు.
వీరిలో అత్యుత్తమ వ్యక్తిని ఎంపిక చేసే బాధ్యతను క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవిఎస్ లక్ష్మణ్ త్రయానికి అప్పగించినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులైన సచిన్, గంగూలీ, లక్ష్మణ్ కలిసి కోచ్ను ఎంపిక చేయనున్నారు.
దీంతో పాటు క్రికెట్, బీసీసీఐలో పాలన పరంగా అనుభవం ఉన్న సంజయ్ జగ్డాలేను ఈ కమిటీకి చీఫ్ కో ఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. చీఫ్ కోచ్ రేసులో ఉన్న 21 మంది అభ్యర్ధుల పూర్వాపరాలు పరిశీలించి, ఇంటర్వ్యూలను ఈ కమిటీ నిర్వహిస్తుంది.

కావాలనుకుంటే 57 మంది అభ్యర్ధుల దరఖాస్తులను ఈ కమిటీ పరిశీలించవచ్చని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. జూన్ 21లోగా ఈ ప్రక్రియను ముగించి తుది నివేదికను జూన్ 22న బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు అందజేయాల్సి ఉంటుంది.
కాగా సీఏసీలో కీలక సభ్యుడైన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ఇంగ్లాండ్లో విహారయాత్రలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే కోచ్ ఎంపిక ప్రక్రియలో సచిన్ టండూల్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులో ఉంటారని బీసీసీఐ స్పష్టం చేసింది.
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, మాజీ కెప్టెన్ అనిల్కుంబ్లే, సెలెక్టర్ల కమిటీ ఛైర్మన్ సందీప్పాటిల్, వెంకటేశ్ ప్రసాద్, బల్విందర్ సింగ్ సంధు లాంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. వీరి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.