టీమిండియా లీడ్ స్పాన్సర్ హక్కుల కోసం బీసీసీఐ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లను ఈ నెల 26వ తేదీ వరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్ హక్కులకు కనీస ధరను రూ.350 కోట్లకు ఫిక్స్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ఇటీవల టీమిండియా ఆడిన డబ్ల్యూటీసీ ఫైనల్లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు ఆడిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు టీమిండియా స్పాన్సర్గా ఉన్న బైజూస్ చెల్లించిన దాని కన్నా ఇది తక్కువ అని తెలుస్తోంది. భారత జట్టు స్వదేశంలో ఆడే ఒక్కో మ్యాచ్కూ రూ.5.07 కోట్లను బైజూస్ చెల్లించేది. అదే కనుక ఐసీసీ, ఏసీసీకి సంబంధించిన టోర్నీల్లో అయితే మ్యాచ్కు రూ.1.56 కోట్లు చెల్లించేది. కానీ ఈసారి మాత్రం స్పాన్సర్ షిప్ హక్కుల కనీస ధరను బీసీసీఐ బాగా తగ్గించేసినట్లు తెలుస్తోంది.

ఇది బీసీసీఐ తీసుకున్న తెలివైన నిర్ణయం అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అడ్వర్టైజ్మెంట్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడుతున్నారు. 'లీడ్ స్పాన్సర్ హక్కులకు చాలా రియలిస్టిక్గా కనీస ధరను బీసీసీఐ నిర్ణయించింది. ఇంతకాలం క్రికెట్పై భారీగా ఖర్చు పెట్టిన చాలా మంది స్పాన్సర్లు తమ ఖర్చును భారీగా తగ్గించేసుకుంటున్నారు' అని సదరు ఎక్స్పర్టులు చెప్తున్నారు.
ఈ క్రమంలో బీసీసీఐ చాలా తెలివిగా తమ స్పాన్సర్షిప్ ధరను తగ్గించిందని నిపుణుల అభిప్రాయం. కాగా, ఇటీవలే టీమిండియా టూల్ కిట్ స్పాన్సర్గా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ఆదిదాస్తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే లీడ్ స్పాన్సర్గా కూడా ఎక్కువ కాలం ఉండే సంస్థతోనే ఒప్పందం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. మరి ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో చూడాలి.