బంగ్లాదేశ్తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్లో మొదటి టెస్టుకు భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 16 మందితో కూడిన జట్టును వెల్లడించింది. టీమిండియా ఎంపికలో అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ అంచాలకు భిన్నంగా ఏమీ చేయలేదు. రోడ్డు ప్రమాదంతో ఆటకు కొన్నాళ్లు దూరమైన రిషభ్ పంత్ను 21 నెలల తర్వాత తిరిగి టెస్టు జట్టులోకి తీసుకువచ్చింది.
యువ పేసర్ యశ్ దయాల్కు అవకాశం ఇచ్చింది. ఈ ఎడమచేతి వాటం పేసర్ తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. ఆకాశ్ దీప్కు కూడా ఛాన్స్ ఇచ్చింది. అయితే వైస్ కెప్టెన్ లేకుండా భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20, వన్డే సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్, వైస్ కెప్టెన్ వివరాలు స్పష్టంగా పేర్కొన్న బీసీసీఐ.. టెస్టు ఫార్మాట్లో మాత్రం ఉపసారథి గురించి ఊసే లేదు.

టీ20 వరల్డ్ కప్ అనంతరం జరిగిన జింబాబ్వే సిరీస్కు సీనియర్లు దూరమవ్వడంతో శుభ్మన్ గిల్ భారత జట్టును నడిపించాడు. కానీ ఆ తర్వాత జరిగిన శ్రీలంక పర్యటనకు గిల్ అనూహ్యంగా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. భవిష్యత్ సారథిగా గిల్ను సిద్ధం చేస్తున్నామని బీసీసీఐ పరోక్షంగా పేర్కొంది. దీంతో అన్ని ఫార్మాట్లలో ఇకపై గిల్ వైస్ కెప్టెన్గా కొనసాగుతాడని భావించారంతా. కానీ బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో ఉపసారిథి లేడు.
భవిష్యత్ కెప్టెన్గా గిల్ను తీర్చిదిద్దే విషయంలో బీసీసీఐ వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ఫార్మాట్లకు ఆడే ప్లేయర్ వైస్ కెప్టెన్గా ఉంటే బాగుంటుందని నయా కోచ్ గంభీర్-బోర్డు తొలుత భావించింది. కానీ ఇప్పుడు సహజంగా నాయకత్వ లక్షణాలు ఉన్న ఆటగాడిని కెప్టెన్గా ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక బుమ్రా ఇటీవల చేసిన వ్యాఖ్యలతో బీసీసీఐ తన ఆలోచన మార్చుకున్నట్లు సమాచారం. జట్టును ఫాస్ట్ బౌలర్ కంటే ఎవరూ గొప్పగా నడిపించలేరని, కెప్టెన్సీ చేయడానికి ఆసక్తి ఉందని బుమ్రా పరోక్షంగా పేర్కొన్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.