
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 కోసం ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి సుమారు 20వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సన్నాహాలు చేసింది. ఇందు కోసం రూ.10కోట్ల బడ్జెట్ను కూడా కేటాయించింది. భారత్లో తమ ఆటగాళ్లకు నిర్వహించిన కరోనా పరీక్షల ఖర్చును ఫ్రాంఛైజీలు భరించగా.. యూఏఈలో అడుగుపెట్టిన తర్వాత నిర్వహిస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టుల ఖర్చును బీసీసీఐ భరించనుంది.
'ఐపీఎల్ సమయంలో కరోనా పరీక్షల కోసం బీసీసీఐ రూ.10కోట్లను ఖర్చు చేస్తుంది. కంపెనీకి చెందిన 75 మంది హెల్త్కేర్ వర్కర్లు ఐపీఎల్ టెస్టింగ్ ప్రక్రియలో భాగమే' అని ఐపీఎల్ సీనియర్ అధికారి చెప్పారు. 'ఆటగాళ్లు, అధికారుల భద్రతకు సంబంధించి ఎలాంటి అలసత్వం వహించేది లేదు. హెల్త్కేర్ వర్కర్లు ప్రత్యేక హోటల్లో ఉంటారని' ఆయన వివరించారు. పన్నులు కాకుండా ప్రతి పరీక్షకు బీసీసీఐకి 200 దిర్హామ్ల (రూ.4వేలు) ఖర్చు అవుతుందని ఐపీఎల్ సీనియర్ అధికారి తెలిపారు.
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్లు జరగనుండగా.. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్ల్ని నిర్వహించనున్నారు. దాంతో టోర్నీ ముగిసే వరకూ కరోనా టెస్టుల కోసం యూఏఈలోని ఒక వీపీఎస్ హెల్త్ కేర్ సెంటర్తో బీసీసీఐ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 13వ సీజన్ కోసం ఆగస్టు 20న యూఏఈకి అన్ని జట్లు చేరుకోగా.. అప్పటి నుంచే కరోనా టెస్టులు మొదలుపెట్టిన వీపీఎస్ సంస్థ.. ఇప్పటికే దాదాపు 2000 టెస్టులు చేసినట్లు తెలుస్తోంది.
టోర్నీ జరిగే సమయంలోనూ ప్రతి ఐదు రోజులకి ఒకసారి క్రికెటర్కి కరోనా వైరస్ పరీక్షలు చేయాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించింది. టీమ్ సపోర్ట్ స్టాఫ్, హోటల్ సిబ్బంది, ట్రావెల్, ఫ్రాంఛైజీల మేనేజ్మెంట్ ఉద్యోగులు ఇలా పెద్ద సంఖ్యలో ఆటగాళ్లతో కాంటాక్ట్ అయ్యే వారికి కూడా రెగ్యులర్గా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తంగా టోర్నీ ముగిసేలోపు సుమారు 20,000 టెస్టులు చేయనున్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది.