ముంబై: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేపట్టిన దాడి.. భారత క్రికెట్ నియంత్రణ బోర్డును కదిలించింది. నాటి ఘటనలో అమరు వీరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంతాపాన్ని ప్రకటించడంతోనే చేతులు దులిపేసుకోలేదు బీసీసీఐ. వారి సంక్షేమానికి శ్రీకారం చుట్టింది. సైనిక సంక్షేమ నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది. ఈ విరాళం మొత్తం 20 కోట్ల రూపాయలు.
దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సాయుధ బలగాల సంక్షేమానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అమర జవాన్ల త్యాగాలకు గుర్తుగా ఈ విరాళాన్ని వినియోగించాలని ఇదివరకే రక్షణ శాఖను కోరిన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల సందర్భంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల్లో ఒక సీనియర్ క్యాడర్ అధికారిని ఆహ్వానిస్తామని, ఆయన చేతికి ఈ 20 కోట్ల రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో రక్షణశాఖకు అందజేయనున్నట్లు బీసీసీఐ పాలక మండలి వెల్లడించింది.
ఐపీఎల్లో సత్తా చాటి వరల్డ్కప్ జట్టులో చోటు సంపాదిస్తా: రహానే
బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మొదట ఈ విషాయన్ని బీసీసీఐ పాలక మండలి వద్ద ప్రతిపాదించారు. మొదట్లో సైనిక సంక్షేమ నిధికి బీసీసీఐ తరఫున అయిదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించాలని నిర్ణయించారు. సైనికుల కోసం ఎంత చేసినా తక్కువే అనే అభిప్రాయానికి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని 20 కోట్ల రూపాయలకు పెంచారు.