
హైదరాబాద్: చివరి నిమిషంలో ఇబ్బందులు ఎదురుకాకుండా 2018-19 సీజన్లో స్వదేశంలో జరగనున్న మ్యాచ్ల కోసం వేదికలను ఎంపిక చేసేందుకు గాను శనివారం బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఈ ఏడాది భారత్ స్వదేశంలో ఆడే మ్యాచ్లకు సంబంధించి వేదికల ఎంపికపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా బీసీసీఐ టూర్స్ అండ్ ఫిక్చర్స్ కమిటీతో సమావేశమైన బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ 'ఈ ఏడాది సొంతగడ్డపై వెస్టిండీస్, ఆస్ట్రేలియా సిరీస్లకు సంబంధించిన వేదికలు, తేదీలను నిర్ణయించేందుకు ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం నిర్వహించాం. వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లతో జరగనున్న మ్యాచ్లకు స్టేడియాలను ఎంపికచేశాం' అని అన్నారు.
'రెండు టెస్టుల్లో ఏదైనా ఒక టెస్టు మ్యాచ్ను డే/నైట్ ఫార్మాట్లో నిర్వహించాలనే ప్రతిపాదనను కమిటీ పరిశీలించింది. అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. వారంతా ఏకగ్రీవంగా ప్రయోగానికి అనుకూలంగా అంగీకారం తెలిపారు. సమావేశంలో తీసుకున్న సిఫార్సులను సీఓఏకు పంపించాం' అని అమితాబ్ చౌదరి వెల్లడించారు.
అయితే సుప్రీం కోర్టు నియమించిన పాలకుల కమిటీ(సీఓఏ) ఆమోదం తెలిపిన తర్వాతే డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహిస్తామని అమితాబ్ తెలిపారు.టీమిండియా తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ను హైదరాబాద్ లేక రాజ్కోట్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ ఏడాది స్వదేశంలో టీమిండియా కేవలం మూడు టెస్టు మ్యాచ్లే ఆడనుంది. అఫ్ఘనిస్తాన్తో చారిత్రాత్మక ఏకైక టెస్టు, వెస్టిండీస్తో రెండు టెస్టు మ్యాచ్లు జరగనున్నాయి.
అయితే వీటిలో ఒక టెస్ట్ మ్యాచ్ను ప్రయోగాత్మకంగా డే- నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ మేరకు సమావేశంలోని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 2018-19 సీజన్లో కోహ్లీసేన స్వదేశంతో పోలిస్తే ఎక్కువగా విదేశాల్లోనే పర్యటిస్తోంది. స్వదేశంలో బెంగళూరు వేదికగా ఆప్ఘనిస్థాన్తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడనుంది.
ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న తర్వాత ఆసియా కప్లో ఆడుతుంది. అనంతరం భారత పర్యటనకు వచ్చే వెస్టిండిస్ జట్టుతో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, 3 టీ20లు ఆడుతుంది. అనంతరం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరుతుంది.