
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం ముదురుతోంది. ఇరువురు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పరిస్థితులను మరింత వేడెక్కిస్తున్నారు. టీ20 వరల్డ్కప్ నుంచి తప్పుకోవద్దని, అలాగే వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు తనకు ముందుగానే చెప్పినట్టు బీసీసీఐ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని విరాట్ కోహ్లీ నేడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేడు కోహ్లీ చేసిన వ్యాఖ్యలన్నింటిని బీసీసీఐ ఖండించింది. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునేటప్పుడే వద్దని కోహ్లీకి నచ్చజేప్పే ప్రయత్నం చేశామని అయినా కోహ్లీ అందుకు అంగీకరించలేదని తెలిపింది. టీ20ల నుంచి తప్పుకుంటే వన్డేల నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తుందని కోహ్లీకి ముందే చెప్పామని కూడా బీసీసీఐ చెప్పింది. కానీ తమ మాట వినకుండా కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని వివరించింది.
ఇక వన్డేలు, టీ20లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటే జట్టు సమన్వయంలో లోపం వస్తుందని భావించామని, అందుకే కోహ్లీని వన్డేల నుంచి కూడా తప్పించాలని నిర్ణయించామని, ఈ విషయాన్ని కోహ్లీకి ముందుగానే చెప్పామని బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ విషయం గురించి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ విరాట్ కోహ్లీతో ముందుగానే చర్చించినట్టు బీసీసీఐ పేర్కొంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు కేవలం గంటన్నర ముందే సెలెక్టర్లు తనకు చెప్పారని కోహ్లీ చెప్పింది అవాస్తవమని చెప్పింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు కోహ్లీకి రెండు రోజుల ముందుగానే చెప్పామని తెలిపాడు. దీంతో నేడు విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ పూర్తిగా తోసిపుచ్చింది. అంతేకాకుండా బీసీసీఐకి, విరాట్ కోహ్లీకి మధ్య వివాదం మరింత ముదిరినట్టయింది. దీంతో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు బీసీసీఐ ముందుగా చెప్పలేదని, తనతో ఎలాంటి చర్చలు జరపలేదని విరాట్ కోహ్లీ నేడు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లోని తాను ఆడతానని కోహ్లీ స్పష్టం చేశాడు. కాగా 2021 టీ20 వరల్డ్కప్ సమయంలో తాను టీ20 ఫార్మాట్ కెప్టెన్గా తప్పుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వన్డే, టెస్టు ఫార్మాట్కు కెప్టెన్గా కొనసాగుతానని అప్పట్లో ప్రకటించాడు. కానీ బీసీసీఐ నిర్ణయంతో అది ఫలించలేదు.