కోహ్లీ, బుమ్రాలకు విశ్రాంతి
సెలెక్టర్లు ఈ నెల 19న ముంబైలో సమావేశమై ఈ సిరీస్ కోసం వెళ్లే జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తోంది. మరోవైపు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంపికపై ఎలాంటి అంచనాకు రాలేదని తెలుస్తోంది. ప్రపంచకప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ధోనీ మాత్రం ఏ విషయం ప్రకటించలేదు. దీంతో వెస్టిండీస్ టూర్లో అతడు ఆడుతాడో లేదో తెలియదు.
ఎలాంటి సమాచారం లేదు:
'సెలెక్టర్లు 19న ముంబైలో సమావేశమవుతారు. ధోనీ నుంచి ఎలాంటి సమాచారం లేదు. సెలక్టర్లకు, ఆటగాళ్లకు మధ్య సంబంధాలు ఉంటాయి. ప్రపంచకప్లో ధోనీ బాగా ఆడాడు. ఆటలో కొనసాగాలా లేదా అనే విషయాన్ని అతడు నిర్ణయించుకోగలడు' అని జరిగిన సీవోఏ సమావేశం అనంతరం బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.
కెప్టెన్గా రోహిత్ శర్మ:
షెడ్యూల్ ప్రకారం టీమిండియా త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది. ఆగస్టు 3న టీ20 సిరిస్తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఈ సిరిస్లో భాగంగా టీమిండియా తన మొదటి రెండు టీ20లను ఫ్లోరిడాలో ఆడనుంది. విండిస్ పర్యటనలో విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే రోహిత్ శర్మ వన్డేల్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహారిస్తాడు. టెస్టు సిరిస్కు రహానే నాయకత్వం వహిస్తాడు. యువ పేసర్లు ఖలీల్ అహ్మద్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్లు జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉంది.