వన్డే ఫార్మట్ కోసం..
ఇప్పటికే టీ20 ఫార్మట్కు రోహిత్ శర్మ రూపంలో కొత్త కేప్టెన్ వచ్చాడు. వన్డే ఇంటర్నేషనల్స్కు కూడా దీన్ని వర్తింపజేయాలని రాహుల్ ద్రవిడ్ సూచించినట్లు తెలుస్తోంది. టెస్ట్, వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్ టీమ్కు ప్రస్తుతం విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. అతన్ని వన్డే ఫార్మట్ నుంచి తప్పించాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చింది. మూడు ఫార్మట్లకూ ముగ్గురు కేప్టెన్లను నియమించే దిశగా అడుగులు వేస్తోంది. కొత్త వన్డే ఫార్మట్ కేప్టెన్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది కూడా.
త్వరలో
ఇందులో భాగంగా- బీసీసీఐ సెలెక్షన్ కమిటీ త్వరలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో సమావేశం కానుంది. చేతన్ శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వారిద్దరి అభిప్రాయాలను సేకరించనుంది. ఇద్దరూ ఎవరి వైపు మొగ్గు చూపుతారో, ఎవరి పేరును సూచిస్తారో తెలుసుకోనుంది. వన్డే ఫార్మట్ కోసం కొత్త కేప్టెన్ను సెలెక్ట్ చేసే విషయంలో ఎలాంటి ప్రయోగాల జోలికి కూడా వెళ్లకూడదని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ముందున్నది క్లిష్టమైన దక్షిణాఫ్రికా పర్యటన కావడం వల్ల జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.
సున్నితమైనదిగా..
దక్షిణాఫ్రికా జట్టుతో ఆ దేశ గడ్డపై మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ను ఆడాల్సి ఉంది టీమిండియా. దక్షిణాఫ్రికా పర్యటన కోసం త్వరలోనే విమానం ఎక్కబోతోంది. ఈలోగా కొత్త కేప్టెన్ ఎవరనేది తేల్చేయనుంది. వన్డేల కోసం కొత్త సారథిని ఎంపిక చేసే విషయాన్ని సెలెక్షన్ కమిటీ అత్యంత సున్నితమైనదిగా భావిస్తోంది. అందుకే ఏకపక్షంగా నిర్ణయాన్ని తీసుకోలేకపోతోందని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రాధాన్యత ఇస్తోందని అంటున్నారు.
రేసులో శిఖర్ ధావన్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ను బీసీసీఐ ఓ ప్రత్యామ్నాయంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. 50 ఓవర్ల ఫార్మట్లో అతను నిలకడగా రాణించడాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇదివరకు శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టుకు కూడా అతను సారథ్యాన్ని వహించాడు. ఆ జట్టుకు రాహుల్ ద్రవిడ్ పార్ట్టైమ్ హెడ్ కోచ్గా పని చేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వన్డే సిరీస్ను గెలుచుకుంది టీమిండియా. ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడటం వల్ల టీ20 సిరీస్లో రాణించలేకపోయింది. దాన్ని కోల్పోయింది.